హైదరాబాద్ : ప్రాజెక్టుల నుంచి చుక్క నీరు కూడా లీక్ కాకుండా చూడాలని, గేట్లు, తూములకు సంబంధించిన మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఇరిగేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల పనుల పురోగతి, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జలసౌధలో రజత్ కుమార్ సోమవారం ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రజత్కుమార్ మాట్లాడుతూ.. లక్షల కోట్ల నిధులను వెచ్చిస్తూ అనేక ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్మిస్తున్నదని, ఈ నేపథ్యంలో వాటి నిర్వహణ, పర్యవేక్షణపై కూడా ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్వహణను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. వెంటనే ఆయా ప్రాజెక్టుల గేట్లకు గ్రీసింగ్, కలరింగ్ పూర్తి చేయాలని, తూముల మరమ్మతులు ఉంటే వెంటనే చేపట్టాలని ఆదేశించారు. వర్షా కాలం వచ్చేనాటికి అన్ని పనులను పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఈ నెల 6న నిర్వహించనున్న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశ ఎజెండాపైనా సంబంధిత అధికారులతో చర్చించారు. సమావేశంలో ఈఎన్సీ మురళీధర్, ఓ అండ్ఎం ఈఎన్సీ నాగేందర్, ఈఎన్సీ హరిరామ్, అంతరాష్ట్ర జలమండలి అధికారులు, చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఈఈలు తదితరులు పాల్గొన్నారు.