హైదరాబాద్ : వేసవిలో పశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వేసవిలో పశువుల సంరక్షణపై సోమవారం హైదరాబాద్లో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పశుపోషకులు, గొర్రెల మేకల పెంపకందారులు తమ పశువులు, జీవాలను ఎండ నుంచి కాపాడుకోవాలని సూచించారు.
జీవాలను ఎండ తీవ్రత తక్కువగా ఉండే ఉదయం, సాయంత్ర వేళల్లో మాత్రమే మేత కోసం బయటకు తీసుకెళ్లాలని.. మధ్యాహ్నం సమయంలో వాటిని కొట్టాల్లో మాత్రమే ఉంచి పచ్చిమేత, తగినంత శుభ్రమైనతాగునీరు అందుబాటులో ఉంచాలి అని సూచించారు. దీనితో పాటు కొట్టాలకు గోనెసంచులు కట్టి, వాటిని తరచూ నీటితో తడపడం ద్వారా వేడి, వడదెబ్బ నుంచి పశువులను, జీవాలను కాపాడుకోవచ్చని తెలిపారు.
అనంతరం గొర్రెల యూనిట్ల వలన పొందే లాభాలను తెలియజేసే కరపత్రాలను కూడా మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక, డైయిరీ, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదర్ సిన్హా, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా రాంచందర్ పాల్గొన్నారు.