హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): యోగాతో శారీరకంగా, మానసికంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని తెలిసిందే. గర్భిణులు యోగా చేయడం వల్ల సాధారణ ప్రసవం అయ్యే అవకాశాలు 90 శాతానికిపైగా పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. యోగాతో శారీరకంగా, మానసికంగా ఆరోగ్య సమస్యలు తొలిగిపోవడంతోపాటు కండరాలు ప్రసవానికి సిద్ధం అవుతాయని అంటున్నారు. రోజూ కనీసం 30 నిమిషాలపాటు యోగా చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.
అదనంగా ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుందని, నాడులన్నీ ప్రేరేపితం అవుతాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆయుష్ విభాగం గర్భిణులకు యోగా శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద పరిశోధన విభాగం గర్భిణుల కోసం ప్రత్యేకంగా ఒక కోర్సును రూపొందించింది. గర్భం దాల్చినప్పటి నుంచి 9 నెలల వరకు ఎలాంటి ఆసనాలు వేయాలో సూచించింది. ఇందులో మొత్తం 13 రకాల ఆసనాలు ఉంటాయి. గర్భం దాల్చిన తర్వాత మొదటి మూడు నెలల్లో 3 రకాల ఆసనాలు, 3 నుంచి 6 నెలల వరకు 6 రకాల ఆసనాలు, 6 నుంచి 9 నెలల వరకు 4 రకాల ఆసనాలు ఉంటాయి.
రాష్ట్రవ్యాప్తంగా యోగా శిక్షణ..
సాధారణ ప్రసవాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రతి సమీక్షలో, అవకాశం ఉన్న ప్రతి వేదికపై సాధారణ ప్రసవాల ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారు. తగిన చర్యలు తీసుకొంటున్నారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో కొంత మార్పు మొదలైంది. దీనిని మరింత పెంచేందుకు గర్భిణులకు యోగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఓవైపు ఆయుష్ శాఖ ‘ఆయుష్ గ్రామ్’ పేరుతో ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి, ఆశ, ఏఎన్ఎంలు, గర్భిణులకు యోగా శిక్షణ ఇస్తున్నది.
ఇప్పటివరకు సుమారు 10 జిల్లాల్లో ఆయుష్ గ్రామ్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు జిల్లాల నుంచి కొందరు ఆశ, ఏఎన్ఎంలను ఎంపిక చేసివారికి ఇప్పటికే యోగా శిక్షణ ఇచ్చారు. వారిని ఆయా జిల్లాల పరిధిలోని మిగతా వారికి శిక్షణ ఇచ్చేలా వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. దీంతోపాటు ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ‘ఎంసీహెచ్’లలో యోగా సాధన కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేయనున్నది. ఓపీ కోసం వచ్చే గర్భిణులకు రోజుకు కనీసం అరగంటపాటు యోగాసనాలు సాధన చేయించనున్నారు.
గర్భిణుల ఆసనాలు ఇలా..
రెండో త్రైమాసికంలో ఆసనాలు
మూడో త్రైమాసికంలో ఆసనాలు
వీటితోపాటు కచ్చితంగా ప్రాణాయామం, ధ్యానం చేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాణాయామం వల్ల శరీరం పీల్చుకున్న ఆక్సిజన్ ప్రతి కణానికి సమాన స్థాయిలో అందుతుంది. దీంతో నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. మానసిక సమతుల్యత పెరుగుతుంది. ధ్యానం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
90 శాతం మందికి సాధారణ ప్రసవం
ఆయుర్వేద దవాఖానకు వచ్చే గర్భిణులకు పూర్తిస్థాయిలో పరీక్షలు చేస్తున్నాం. వారికి సాధారణ ప్రసవం కావడానికి యోగా, ఇతర టెక్నిక్స్ నేర్పిస్తున్నాం. యోగాతో శరీర కండరాలు, నాడులు ఉత్తేజితం కావడంతోపాటు మానసికంగా బలోపేతం అవుతారు. దీంతో ఆరోగ్యంగా ఎదుగుతారు. కొవిడ్ ముందు వరకు ఇక్కడే ప్రసవాలు చేశాం. ఇందులో 90 శాతానికిపైగా సాధారణ ప్రసవాలే అయ్యాయి.
– డాక్టర్ సునీత జోషి, హెచ్వోడీ,ప్రసూతి స్త్రీ రోగ విభాగం, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, ఎర్రగడ్డ
బిడ్డకు సరిపడా ఆక్సిజన్
కడుపులోని బిడ్డ పెరుగుదలకు, ప్రసవానికి సహాయపడే కండరాలు, ఎముకలు యోగాతో బలోపేతం అవుతాయి. నాడులన్నీ ఉత్తేజితం అవుతాయి. తద్వారా శరీరం సాధారణ ప్రసవానికి సిద్ధం అవుతుంది. ప్రాణాయామం చేయడం వల్ల కడుపులోని బిడ్డకు కూడా రక్త ప్రసరణ పెరిగి, ఆక్సిజన్ ఎక్కువ అందుతుంది. బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది.
– డాక్టర్ నాగలక్ష్మి, రీడర్, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, ఎర్రగడ్డ
ఒత్తిడి తగ్గింది.. ధైర్యం పెరిగింది
గర్భందాల్చిన మొదట్లో నేను బాగా మానసిక ఒత్తిడికి గురయ్యాను. శరీరం నా ఆధీనంలో లేనట్టుగా అనిపించేది. ఇక్కడికి వచ్చిన తర్వాత యోగా, ప్రాణాయామం, ధ్యానం సాధన చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు మానసిక ఒత్తిడి పూర్తిగా తగ్గింది. నాలో కలిగే మార్పులను ఆస్వాదిస్తున్నాను. శరీరం పూర్తిగా నా ఆధీనంలోకి వచ్చినట్టు అనిపిస్తున్నది.
– నవ్య, గర్భిణి, ఎర్రగడ్డ