హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన (Party Defection) ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్లో గెలించి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురికి శుక్రవారం నోటీసులు పంపించారు. వీరి విచారణ ముగిసిన తర్వాత మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నది. వచ్చే వారం నుంచి వీరి విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది.
బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానిపై అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించారని సమాచారం. ఆ తర్వాతే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, సంజయ్కుమార్, తెల్లం వెంకట్రావు, అరెకపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్గౌడ్, కృష్ణమోహన్రెడ్డి, మహిపాల్రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారందరికీ నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకొన్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
కాగా, తనకు నోటీసులు అందాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారని చెప్పారు. నోటీసుపై న్యాయనిపుణులతో మాట్లాడి వివరణ ఇస్తానని తెలిపారు. తాను అసలు పార్టీ మారలేదని, టెక్నికల్గా బీఆర్ఎస్లోనే ఉన్నానని వెల్లడించారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పారు. ఇప్పటికీ తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు.