కామారెడ్డి : దేవుడి దయతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ప్రాజెక్టులోకి పుష్కలంగా నీళ్లు వచ్చాయని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి (Speaker Pacharam) అన్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ( Nizamsagar ) ను స్థానిక జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే తో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ( Rains) ప్రాజెక్టులు నిండు కుండలా మారుతున్నాయని పేర్కొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 14.045 అడుగుల లెవల్ లో 15.03 టీఎంసీ ల నీటిని నిల్వ చేస్తూ మిగిలిన వరదను ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువన మంజీరా (Manjeera) నదిలోకి విడుదల చేస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటితో ఆయకట్టులోని 1.50 లక్షల ఎకరాలకు ఈ వానాకాలంతో పాటుగా వచ్చే యాసంగిలో కూడా డోకా లేకుండా అందించవచ్చని వివరించారు.
వర్షాలు కురవక, ప్రాజెక్టు లోకి నీళ్లు రాకపోతే వానాకాలం సాగుకు అవసరమైన మరో 5 టీఎంసీల నీటిని కొండపోచమ్మ సాగర్ (Konda pochamma Sagar) ద్వారా అందిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) హామీ ఇచ్చారు. దేవుని దయతో వర్షాలు విస్తారంగా కురిసి ప్రాజెక్టు లోకి పుష్కలంగా నీళ్లు వచ్చాయని పేర్కొన్నారు. రాజు ధర్మాత్ముడు అయితే రాజ్యం సుభీక్షంగా ఉంటుంది. నాడు మహాభారతంలో కౌరవుల పాలన కాలంలో ఉన్న కరువు పాండవులు రాజ్యం పగ్గాలు చేపట్టగానే పోయి సమృద్ధిగా వర్షాలు కురిసి సుభీక్షంగా మారిందని అన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండి సమృద్ధిగా పంటలు పండుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం 1.50 కోట్ల ఎకరాలకు, దిగుబడులు 3 కోట్ల టన్నులకు పెరిగాయని తెలిపారు. నిర్మాణం లోని మిగితా సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తయితే మరో కోటి టన్నులకు ధాన్యం ఉత్పత్తి పెరుగుతుందని స్పీకర్ అన్నారు.
వారికి ఆలోచనలు రావు..పనులు చేయరు
ఆలోచనలు లేని ప్రతిపక్ష నాయకులు కాలేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
వారికి ఆలోచనలు రావు, పనులు చేయరు. నీళ్లు పుష్కలంగా అందుబాటులో ఉండే ప్రాణహిత నది కలిసే కాళేశ్వరం ను వదిలి, నీళ్లు లేని తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టాలని అసంబద్ధంగా వాదిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు 86,000 కోట్లు అయితే లక్ష కోట్ల అవినీతి అని విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. వారి వెంట కామారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షుడు డి అంజిరెడ్డి, ప్రజాప్రతినిధులు, సాగునీటి శాఖ ఇంజనీర్లు, అధికారులు ఉన్నారు.