నిజామాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సరికొత్త చరిత్రను లిఖించారు. ఇప్పటి వరకు స్పీకర్గా పని చేసిన వారందరూ తదుపరి ఎన్నికల్లో తిరిగి గెలవరనే సెంటిమెంట్ను శ్రీనివాసరెడ్డి బద్దలుకొట్టారు. శాసన సభాపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే పోచారం తాజా ఎన్నికల ఫలితాల్లో చారిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు పనిచేసిన ఏ ఒక్క అసెంబ్లీ స్పీకర్ తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేదు. దీంతో సభాపతులకు పదవీగండం తప్పదనే సెంటిమెంట్ ఉండేది. ఇప్పుడాసెంటిమెంట్ను తిప్పికొడుతూ పోచారం బాన్సువాడలో ఘన విజయం సాధించి చరిత్రను తిరగరాశారు.
తన రాజకీయ జీవితంలో మొత్తం 8 సార్లు పోటీ చేసిన పోచారం.. ఏడుసార్లు గెలుపొందారు. 2004లో ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. మూడు పర్యాయాలు మంత్రిగా, ఒకసారి శాసన సభాపతిగా పని చేసిన రికార్డు ఆయన సొంతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్లో తొలి వ్యవసాయ శాఖ మంత్రిగానూ పోచారం శ్రీనివాసరెడ్డి ఘనతను దక్కించుకున్నారు. 2018లో రెండోసారి ఏర్పాటైన ప్రభుత్వంలో స్పీకర్గా విధులు నిర్వర్తించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవకే అంకితమైన పోచారం శ్రీనివాసరెడ్డి జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది.