బీర్కూర్, మే 28: సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు వచ్చే శాసనసభ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి తానే బరిలో ఉంటానని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా బీర్కూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ.. వయసు రీత్యా తన కుమారుల్లో ఎవరినైనా ఒకరిని అసెంబ్లీ బరిలో నిలపాలని అనుకున్నా కానీ.. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పిలిచి తననే పోటీ చేయాలని సూచించినట్టు చెప్పారు. సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నాయని, కుమారుల విషయం తనకు వదిలిపెట్టాలని సీఎం స్పష్టం చేసినట్టు పోచారం పేర్కొన్నారు.
‘రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా మీరే ఉండాలని సీఎం సూచించినట్టు’ స్పష్టం చేశారు. ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీల అధ్యక్షుల్లో ఏ ఒక్కరికైనా సీఎం అయ్యేస్థాయి ఉన్నదా? అని ప్రశ్నించారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి పాల్గొన్నారు.