Pocharam Srinivas Reddy | కామారెడ్డి : గ్రామ పంచాయతీలుగా మారిన తాండాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బాన్సువాడ గ్రామీణ మండలం రాంపూర్ తాండాలోని జగదాంబ దేవి, సేవాలాల్ మహారాజ్ ఆలయ 16వ వార్షికోత్సవానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో కూడా స్పీకర్ పాల్గొన్నారు. రూ. 32.50 లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్, షెడ్డు, ప్రహారీ గోడ, సీసీ ప్లాట్ఫాంలను స్పీకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని తాండాలలో జగదాంబ మాతా, సేవాలాల్ మహారాజ్ ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఆలయాలను అందరూ మంచిగా నిర్మించుకున్నారు. గ్రామ పంచాయతీలుగా మారిన తాండాలలో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రేపు నస్రుల్లాబాద్లోని ఎస్టీ గురుకుల పాఠశాలలో జరిగే తెలంగాణ గిరిజనోత్సవానికి అందరూ హాజరు కావాలని స్పీకర్ పిలుపునిచ్చారు. గిరిజన బాలికల విద్య కోసం మన నియోజకవర్గంలోని హన్మాజిపేట – కోనాపూర్ వద్ద బాలికల గురుకులం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. భవనాల నిర్మాణం కోసం రూ. 12 కోట్లు నిధులు కూడా మంజూరు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు జూన్ 26న గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందజేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.