కామారెడ్డి: వర్షాలు ఆలస్యమైనప్పటికీ నిజాంసాగర్ (Nizam Sagar) ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించింది. ప్రాజెక్టు పరిధిలో సాగుకు రైతన్నలు సిద్ధమై, ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న తరుణంలో ఇంకా వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 6 గంటలకు వానాకాలం సీజన్ కోసం నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి 1500 క్యూసెక్కుల నీటిని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి (Speaker Pocharam Srinivas Reddy) విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ సాగర్లో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. అవసరమైతే మరో 5 టీఎంసీల నీటిని కొండపోచమ్మ సాగర్ (Konda Pochamma Sagar) నుంచి తెప్పించి.. ఆయకట్టు కింద ఉన్న 1.5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఇప్పటికే అంగీకరించారని వెల్లడించారు.
సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన స్పీకర్ పోచారం.. నిజాంసాగర్ ఆయకట్టు కింద నారు మడులు వేసుకున్నారని, ఇక్కడ ముందస్తు సాగు చేసుకుంటారని నీటిని విడుదల చేయాలని కోరారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్.. సాగర్ నుంచి నీటి విడుదలకు అంగీకరించారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద నిజాంసాగర్, బాన్సువాడ, బీర్కూర్, వర్ని, నస్రుల్లాబాద్, కోటగిరి, చందూర్ మండలాల్లోని రైతులు వరి నారు పోసుకున్నారు. ఆయా భూములకు వరినాట్ల కోసం సాగర్ నుంచి ప్రధాన కాలువ ద్వారా నీటిని అందించనున్నారు. నాట్లతో పాటు మూడు తడులకు సరిపడా నీరు నిజాంసాగర్లో ఉన్నందున మూడు విడుతల్లో నీటని విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం నిజాంసాగర్లో 5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నీరు పంటల సాగుకు మూడు తడుల కోసం సరిపోతుంది. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన పక్షంలో నిజాంసాగర్లో నీరు నిల్వ ఉండడం కష్టమే. దీంతో ముందస్తు జాగ్రత్తగా స్పీకర్ పోచారం ..సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం నిజాంసాగర్కు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండ పోచమ్మసాగర్ను నింపి అక్కడి నుంచి 5 టీఎంసీల నీటిని నిజాంసాగర్కు పంపిస్తామని హామీ ఇచ్చారు. కొండపోచమ్మసాగర్లో ప్రస్తుతం 9 టీఎంసీల నీరు ఉంది.
అవసరమైతే ఇంకొన్ని టీఎంసీల నీటిని కాళేశ్వరం లిఫ్ట్ ద్వారా నింపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వానకాలంలో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని భూ ములకు సరిపడా నీరు నిల్వ ఉంటుంది. మంజీరా పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు పుష్కలంగా కురిసిన పక్షంలో నిజాంసాగర్లోకి నీరు వస్తుంది. లేని పక్షంలో కొండపోచమ్మ సాగర్ నుంచి నీరు రానున్నది. దీంతో రైతులు నిర్భయంగా పంటలను సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.80 టీ ఎంసీ లు) కాగా.. ప్రస్తుతం 1391.93 అడుగుల (4.94 టీఎంసీలు)వద్ద ఉన్నదని డీఈఈ శ్రావణ్కుమార్ తెలిపారు.