మహబూబ్నగర్ : జిల్లాలోని మూసాపేట మండలం మహ్మద్ హుస్సేన్పల్లి గ్రామంలో రూ. కోటి 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న 25 డబుల్ బెడ్రూం ఇండ్లకు మంత్రి నిరంజన్రెడ్డి శంకుస్థాపన చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి శనివారం హుస్సేన్పల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న భూగర్భ మురుగు కాల్వలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పల్లె ప్రకృతి వనాన్ని, వైకుంఠధామాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్లె ప్రగతి తర్వాత ఊర్లు అద్దంలా మెరవాలన్నారు. ప్రతి గ్రామానికి పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం,సెగ్రిగేషన్ షెడ్, నర్సరీ, ట్రాక్టర్, ట్రాలీ ఇచ్చాం. ఐదేళ్లలో ప్రతి గ్రామం అద్దంలా మెరవాలని చెప్పారు. గ్రామానికి మరో 25 డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. గ్రామానికి మండల కేంద్రంతో కలిపే విధంగా బీటీ రహదారికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. తన ఎమ్మెల్యే నిధుల నుండి 10 లక్షల రూపాయలు యాదవ కమ్యూనిటీ, దళిత కమ్యూనిటి భవనాలకి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ నిధుల నుండి మరో రూ. 5 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నెలరోజుల్లో గ్రామంలోని మహిళలకు 20 కుట్టుమిషన్లు ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఆర్డీవో పద్మ, డీపీవో వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారిని సుచరిత, ట్రాన్స్కో ఎస్ఈ మూర్తి, జెడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్, ఎంపీపీ కళావతి, ప్రత్యేకాధికారి రాధ రోహిణి, తహసీల్దార్ మంజుల, ఎంపీడీవో ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.