నస్రుల్లాబాద్/బాన్సువాడ, సెప్టెంబర్ 11: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో మానవత్వ పాలన కొనసాగుతున్నదని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి చెప్పారు. దేశంలో ఇన్ని సంక్షేమ, మానవీయ పథకాలు అమలుచేసిన సీఎం దేశంలో ఎవరూ లేరని, ఉన్నట్టు చూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, నస్రుల్లాబాద్ మండలాల్లో స్పీకర్ సోమవారం పర్యటించారు. బాన్సువాడతోపాటు హాజీపూర్, సంగెం గ్రామాల్లో రూ.12 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ‘పూర్వకాలంలో రాజులు వ్యవసాయం కోసం చెరువులు తవ్వించారు. దేవాలయాలు నిర్మించారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనలో కూడా సాగునీటి వనరుల అభివృద్ధి, దేవాలయాల నిర్మాణం జరుగుతున్నది. తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల కాలంలో తవ్వించిన గొలుసుకట్టు చెరువులకు మిషన్ కాకతీయ ద్వారా రూ.7,000 కోట్లు వెచ్చించి మరమ్మతులు చేయించారు’ అని పేర్కొన్నారు.
దేశంలో ఇంకా 28 మంది ముఖ్యమంత్రులు ఉన్నారని, వారెవరూ అమలు చేయని పథకాలను సీఎం కేసీఆర్ అమలుచేశారని వివరించారు. 70 ఏండ్ల నుంచి పాలించిన ముఖ్యమంత్రులు ఏం చేశారని నిలదీశారు. అదే తెలంగాణ వచ్చాక 24 గంటల ఉచిత కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతున్నదని చెప్పారు. దేశంలో మన రాష్ట్రంలో మాత్రమే 57 సంవత్సరాలకు వృద్ధ్దాప్య పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. ‘చేసే పనులకు మాత్రమే హామీ ఇస్తున్నాం. చేసిన అభివృద్ధిని మాత్రమే చెప్తున్నాం. ఐదేండ్లలో నియోజకవర్గంలో అడిగిన వారందరికీ అవసరమైన పనులు మంజూరు చేశా. ఇప్పుడు మీరే నాకు బాకీ పడ్డారు. వచ్చే ఎన్నికల్లో అందరూ నన్ను మంచి మనస్సుతో ఆశీర్వదించాలి’ అని పోచారం కోరారు.