బీర్కూర్, జూన్ 24: ‘నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడను అభివృద్ధి చేసిన. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాన్సువాడలో 10 వేల ఇండ్లను కట్టించిన.. తాడూ బొంగరం లేనోళ్లు ఏవేవో మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని భైరాపూర్లో 80, మల్లాపూర్లో 40 డబుల్ బెడ్రూం ఇండ్లను స్పీకర్ శుక్రవారం ప్రారంభించారు.
భైరాపూర్లో ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని, రూ.21 లక్షలతో నిర్మించిన పంచాయతీ నూతన భవనాన్ని, రూ.20 లక్షలతో ముదిరాజ్ సంఘ భవనాన్ని, రూ.10 లక్షలతో డబుల్ బెడ్రూం కాలనీలో నిర్మించిన సీసీరోడ్లు, డ్రైనేజీలను, రూ.5 లక్షలతో నిర్మించిన ఈద్గా షెడ్డును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పోచారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 10 వేల ఇండ్లను తెచ్చుకొన్న నియోజకవర్గం బాన్సువాడ ఒక్కటేనని తెలిపారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు.. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మరో 5 వేల ఇండ్లను తెస్తానని భరోసా ఇచ్చారు. ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, అందులో భాగంగానే బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. మన పథకాలు పక్క రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. అక్రమాలు జరుగుతున్నాయని కొందరు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నోరు ఉంది కదా అని విమర్శలు చేస్తే సమయం వచ్చినప్పుడు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.