Speaker Pocharam | కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాంసాగర్కు తరలించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని మోస్రా మండలం గోవూరు, చింతకుంట గ్రామాల్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవూరులో కాకతీయ కళాతోరణాన్ని ప్రారంభించారు. చింతకుంట ఎత్తిపోతల పథకం పంప్హౌస్ నిర్మాణ పనులను ప్రారంభించారు.
అనంతరం చింతకుంటలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలోని నిజాంసాగర్ ప్రాజెక్టుపై లక్ష ఎకరాల ఆయకట్టు ఆధారపడిందని, సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి.. పూర్తి చేయడంతో కొండపోచమ్మ సాగర్ ద్వారా నిజాంసాగర్కు నీటిని తరలిస్తున్నారన్నారు. రూ.150 కోట్లతో నిర్మిస్తున్న చందూర్, జాకోరా, చింతకుంట లిఫ్ట్ పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఈ పథకం ద్వారా రూ.10వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రూ.200 కోట్లతో సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు.
దీని ద్వారా మరో 12,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి గుంటకు సాగు నీరందించేలా పనులు చేస్తున్నామన్నారు. వ్యవసాయదారుడు బాగుంటేనే ప్రపంచానికి అన్నం అందుతుందని, రైతు నాగలి నేలలో పెడితేనే ప్రపంచంలో అందరికి తిండి దొరుకుతుందన్నారు. రైతన్న తలెత్తుకుని బతికేలా చేస్తున్న ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వమన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్ దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు.
కల్యాణలక్ష్మి పథకం, బస్తీ దవాఖాన, కేసీఆర్ కిట్, గురుకుల పాఠశాలలు ఇలా చెబుతా ఉంటే చాలా ఉన్నాయన్నారు. గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు న్యూట్రిషన్ కిట్ను అందజేస్తున్నామన్నారు. బాన్సువాడలో రాష్ట్రంలోనే అత్యధికంగా 11వేల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు జరిగాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రూ.2వేల పెన్షన్ ఇస్తున్నారని, ఖమ్మం సభలో రాహుల్ రూ.4వేల ఇస్తామని మాయమాటలు చెప్పారన్నారు. మొదట కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వాలని హితవు పలికారు.