కొండాపూర్, ఆగస్టు 20 : హైటెక్సిటీలో మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ దవాఖానను ఆదివారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న జీవనశైలితో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లల్లో కొత్తకొత్త రుగ్మతలు వస్తున్నాయని చెప్పారు. వైద్య విధానంలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి మహిళలు, చిన్నారులకు మెరుగైన చికిత్సలందించడంలో అనతికాలంలోనే మెడికవర్ గ్రూప్స్ మంచి పేరు ప్రఖ్యాతలు సాధించిందని గుర్తు చేశారు.
దవాఖానకు విచ్చేసే ప్రతి ఒక్కరికి ఉత్తమ వైద్యాన్ని అందిస్తూ ముందుకు సాగాల్సిందిగా వైద్యులకు సూచించారు. 100 పడకలతో ప్రారంభించిన దవాఖానలో 24/7 గైనకాలజీ, ఒబెస్ట్రిక్ట్స్, పిడియాట్రిక్స్ అండ్ నియోనాటాలజీ సేవలు అందించనున్నట్లు దవాఖాన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ చైర్మన్ రామలింగేశ్వరరావు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్, అనురాగ్ శర్మ, సజ్జనార్, కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్, దవాఖాన వైద్య బృందం పాల్గొన్నారు.