వర్ని/రుద్రూర్, నవంబర్ 15: రాష్ట్రంలోని ప్రతి గుంటకు సాగు నీరందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా గ్రామం వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పంప్హౌస్ నిర్మాణానికి మంగళవారం ఆయన భూమి పూజ చేశారు.
బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటికే 90 శాతం వ్యవసాయ భూములకు సాగు నీరు అందుతున్నదని తెలిపారు. మిగిలిన భూములకూ సాగు నీరందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. కేవలం నిజాంసాగర్ ఆయకట్టు రైతులకే కాక ఆయకట్టేతర రైతులకు కూడా సాగు నీరందించేందుకు ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాగా, రుద్రూర్లో గల చెరువులో 4.70 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు.