హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశంలోనే ఆదర్శంగా ఉన్నదని, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సభల్లో అర్థవంతమైన చర్చ జరిగేందుకు అందరూ సహకరించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే శాసన మండలి, శాసనసభ సమావేశాల నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాతనం, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలన్నారు. సమావేశాలు పారదర్శకంగా జరిగేందుకు అధికారులు సహకారం అందించాలన్నారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు ఇంకా సమాధానాలు ఇవ్వని పక్షంలో తక్షణమే ఇవ్వాలని అన్నారు.
సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషలో అందించాలని సూచించారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రతీ శాఖ తరఫున ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలన్నారు. శాసనసభ సమావేశాల కోసం జారీ చేసిన పాస్లు ఉన్నవారినే ఆవరణలోకి అనుమతివ్వాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆదేశించారు. సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరగాలన్నారు. అనంతరం గుత్తా సుఖేందర్రెడ్డి, పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తదితరులు శాసనసభ డైరీని ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహాచార్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, డీజీపీ అంజనీకుమార్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహన్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.