కామారెడ్డి : దశాబ్దాల తరబడి ఉన్న పోడు భూముల సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) తెలిపారు. పోడు రైతులు ఇక హక్కుదారులని, ధైర్యంగా భూములనుసాగు చేసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో పోడు భూములకు పట్టాల(Pattas)ను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతికి సంతాపం తెలుపుతూ సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. పోడు పట్టాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
స్పీకర్ మాట్లాడుతూ పోడు పట్టాలు కఠినమైన సమస్య అని పేర్కొన్నారు. గతంలో వానాకాలం వచ్చిందంటే భూమి దున్నడానికి వెళ్లే రైతులు(Farmers), అటవీశాఖ(Forest Staff) సిబ్బంది మద్య ప్రతినిత్యం గొడవలు జరిగేవని గుర్తు చేశారు.2005 కంటే ముందు అటవీ భూములలో సాగులో ఉన్న గిరిజనులకు పట్టాలు అందజేయాలని కేంద్ర చట్టంలో ఉన్నదని వెల్లడించారు.
బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో 2100 మంది బంజారాలకు సుమారు 4000 ఎకరాల పోడు పట్టాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులు ఉంటే సర్వే చేయించి పట్టాలు ఇస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.50 లక్షల మంది గిరిజన రైతులకు మొత్తం నాలుగు లక్షల ఐదు వేల ఎకరాలకు పట్టాలను ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు.ఎటువంటి పైరవీలు, సిఫారసులు లేకుండా అర్హులైన బంజారా లకు పట్టాలు అందుతున్నాయని వెల్లడించారు.ఈ భూములకు కూడా రైతుబంధు వస్తుందన్నారు.
పర్యావరణం బాగుండి, వర్షాలు మంచిగా కురవాలంటే వృక్షాలు ఉండాలి. ఇకనుంచి కొత్తగా చెట్లు నరకకుండా అడవులను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, బాన్సువాడ, బోధన్ ఆర్డీవోలు రాజాగౌడ్, రాజేశ్వర్, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు డి అంజిరెడ్డి, బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజావెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.