హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): మత ఛాందసవాదం ప్రమాదకరమని, ఛాందసవాదుల చేతిలోకి వెళ్లిన కొన్ని దేశాలు ఆర్థికంగా కుప్పకూలిపోయాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మతం పేరిట జరుగుతున్న కుట్రలను యువత తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆదివారం శాసనసభ ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీలు దయానంద్, దండే విఠల్, ఎల్ రమణ, ఫరూక్ హుస్సేన్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, టీఆర్యస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి కే రమేశ్రెడ్డి తదితరులు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ శాంతియుత పోరాట మార్గమే అనుసరణీయమని చెప్పారు. కొంతమంది దుర్మార్గులు గాంధీజీని పొట్టనబెట్టుకొన్నారని, ఆయన చనిపోయే క్షణాల్లో హే-రామ్ అనలేదంటూ సోషల్మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జవహర్లాల్ నెహ్రూ సహా పలువురు స్వాతంత్య్ర సమరయోధులపై సోషల్మీడియాలో కొందరు దుష్ప్రచారాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఛాందసవాదుల చేతిలోకి వెళ్లిన ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు సహా కాబూల్, బాగ్దాద్, టెహ్రాన్ వంటి ఆర్థిక నగరాలు సంక్షోభం నుంచి కోలుకోవడం లేదని వివరించారు.
కేసీఆర్ నాయకత్వం ప్రజల ఆకాంక్ష: గుత్తా
గాంధీ చూపించిన మార్గం యావత్ ప్రపంచానికి మార్గదర్శి అయిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే గాంధీ మళ్లీ పుట్టాల్సిన అవసరం ఉన్నదని అనిపిస్తున్నదని చెప్పారు. దేశానికి కేసీఆర్ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. గాంధీ చూపిన శాంతియుత, సామరస్య మార్గంలో కేసీఆర్ నాయకత్వంలో నెత్తురు చుక చిందకుండా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొన్నామని తెలిపారు.