బాన్సువాడ (కామారెడ్డి ) : రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి(Speaker Pocharam ) తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో పట్టణ ప్రగతి(Pattana Pragathi)దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం(Public Health)పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అందజేస్తున్న కేసీఆర్ కిట్(KCR Kit ) ద్వారా డెలివరీల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. గర్భిణులకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం, న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక హంగులతో వైద్య పరికరాలను ఏర్పాటు చేసి, పేదలకు నాణ్యమైన వైద్యం అందించేలా కృషి చేస్తున్నామని చెప్పారు.
తొమ్మిదేండ్ల కాలంలో పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకే పట్టణ ప్రగతి ఉత్సవమని అన్నారు. గతంలో నెలకు 60 నుంచి 70 డెలివరీలుకాగా 400 నుంచి 500 వరకు జరుగుతున్నాయని వివరించారు. డెలివరీ అయిన తర్వాత తల్లీబిడ్డలను 102 వాహనం ద్వారా ఇంటివరకు ఉచితంగా చేర్చుతున్నారని తెలిపారు. అమ్మ ఒడి పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. బాన్సువాడ పట్టణంలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో కలిసి స్పీకర్ భోజనం చేశారు.