నిజామాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల రెండుకోట్ల ఎకరాల భూములు సాగులోకి రానున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
బీజేపీ నాయకుల వ్యవహారశైలీపై స్పీకర్ మండిపడ్డారు. మీరు ‘మంచి పనులుచేయరు. చేసే ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు చేస్తరు. ప్రభుత్వాలను పడగొట్టడం కాదు. రైతులను నిలబెట్టే పనులు చేయాల’ ని బీజేపీ నాయకులకు సూచించారు. దేశం, ప్రజల సంపద పెరగాలి. ఇద్దరూ, ముగ్గురు పారిశ్రామిక వేత్తల సంపద మాత్రమే పెరగాలి అనేది తప్పు అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతలు, డిండి ఇంకా అనేక ప్రాజెక్టులు చేపట్టిందని,ఈ ప్రాజెక్టులు ద్వారా రాష్ట్రంలో మొత్తం రెండు కోట్ల ఎకరాల భూములు సాగులోకి వస్తాయని వెల్లడించారు.
ఇప్పటికే కోటి యాబై లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆలోచనలు కొంతమందికి అర్ధం కాక విమర్శలు చేస్తున్నారని, బూతులు తిడుతున్నారని ఆరోపించారు.బీజేపీ పాలిత రాష్ట్రా ల్లో కరువు వచ్చిందని, ఉన్న నదుల నీటిని వాడుకోలేక వృథాగా వదిలేస్తున్నారని పోచారం విమర్శించారు. నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో మెట్ట ప్రాంతంలోని భూములకు సాగునీరు అందించడానికి రూ. 120 కోట్లతో సిద్దాపూర్ రిజర్వాయర్, రూ. 106 కోట్లతో జాకోర-చందూరు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు .