హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే ఘటనపై రైల్వే ఎస్పీ అనురాధ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా రైల్వేస్టేషన్పై యువకులు దాడికి పాల్పడ్డారని, ఇందులో 46 మందిని ఆధారాలతో సహా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 2వేల మంది ఆందోళనలో పాల్గొన్నారని, అయితే కోచింగ్ సెంటర్లు అభ్యర్థులను తప్పుదారి పట్టించాయని పేర్కొన్నారు. సదరు కోచింగ్ సెంటర్లను గుర్తించామని, వీరందరికీ రైల్వే యాక్ట్ సెక్షన్ 150 కింద యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
వాట్సాప్ గ్రూప్లను క్రియేట్ చేశారని, వాటిలో ఎలా దాడి చేయాలో చర్చించుకున్నారన్నారు. వాటిని గుర్తించామన్నారు. ఆందోళనకారులు పోలీసులు, ప్రయాణికులపై రాళ్లు రువ్వారని ఎస్పీ పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వాళ్లంతా తెలంగాణకు చెందిన వారేనని, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువకులపై రైల్వే కేసులు నమోదైతే ఉద్యోగాలు రావన్నారు. ఈ నెల 16న వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసి కుట్రకు ప్రణాళిక రూపొందించారని, 17న ఉదయం 8 గంటలకు 300 మంది స్టేషన్లోకి చొరబడ్డారన్నారు. రైల్వేస్టేషన్పై దాడిని ఊహించలేదని, స్టేషన్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామన్నారు.
ఆయిల్ డిపో, రైల్ ఇంజిన్లకు మంటలంటుకుంటే భారీ విస్పోటనం జరిగి ఉండేదన్నారు. భారీ ప్రమాదాన్ని నివారించడానికే కాల్పులు జరిపాల్సి వచ్చిందని ఎస్పీ వివరణ ఇచ్చారు. ఆందోళనకారులపై ఆర్పీఎఫ్ పోలీసులు 20రౌండ్ల కాల్పులు జరిపారన్నారు. దాడిలో రూ.12కోట్ల వరకు నష్టం జరిగినట్లు సమాచారం ఉందని, తొమ్మిది మంది రైల్వే సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. నిందితుల్ని పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, ఓ రైల్ కోచ్ను తగులబెట్టారని.. పదుల సంఖ్యలో కోచ్లు ధ్వంసమయ్యాయని వివరించారు.