హైదరాబాద్: రైతులకు శుభవార్త.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) ముందుగానే వచ్చే అవకాశం ఉంది. సాధారణం కంటే ఒక వారం ముందుగానే కేరళను తాకే అవకాశం ఉన్నదని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయి. అయితే ఈసారి నైరుతి రుతుప వనాలు ఈ నెల 15వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అండమాన్ నికోబార్ దీవుల్లో తొలి వర్షాలు కురవచ్చని అధికారులు వెల్లడించారు.
ఈనేపథ్యంలో రుతుపవనాలు ఈసారి కేరళకు ముందుగానే వచ్చే అవకాశం ఉదని చెప్పారు. జూన్ 5 నుంచి 8 మధ్య తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశించవచ్చని తెలిపారు. కాగా, ఈ ఏడాది దేశవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురు స్తాయని అంచనా వేస్తున్నారు.