అండమాన్లోకి ప్రవేశించిన రుతుపవనం
రెండు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
నైరుతి రుతుపవనాలు సోమవారం దక్షిణ బంగాళఖాతం, అండమాన్ దీవుల్లోకి ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు, మూడ్రోజుల్లో సమీప ప్రాంతాలకూ విస్తరిస్తాయని, దీంతో అండమాన్ నికోబార్ దీవులలో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మే 27 నుంచి జూన్ 1 మధ్యలో రుతుపవనాలు కేరళను తాకనుండగా, జూన్ 5-10 మధ్య తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నటు పేర్కొన్నది.
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గడిచిన 24 గంటల్లో 23 జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 9.92, బీబీపేటలో 8.80, మెదక్ జిల్లానాగపూర్లో 6.98 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 19 జిల్లాల్లో 40 డిగ్రీలపైన, 9 జిల్లాల్లో 39 డిగ్రీలపైన నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 42.8 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా కామారెడ్డి జిల్లా మాచాపూర్లో 20.2 డిగ్రీలు నమోదైందని టీఎస్డీపీఎస్ తెలిపింది. మరోవైపు ఏపీలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అకాల వర్షంతో పంటలకు నష్టం
అకాల వర్షం రైతులపై పిడుగులా పడింది. ఆదివారం రాత్రి వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాలతో అన్నదాతలకు తీరని నష్టం జరిగింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు తడిసిముద్దయ్యాయి. ఈదురుగాలుల దాటి కి విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. పంట నేలపాలు కావడంతో రైతులు పుట్టెడు దుఃఖంలో మునిగారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్లో పలు గుడిసెలు ధ్వంసమయ్యాయి. దస్తూరాబాద్ మండలంలో 260 ఎకరాల పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. బేల మండలం పాఠన్లో ఓ ఇం టి పై కప్పులు ఎగిరిపడగా ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని కురుమపల్లిలో పిడుగు పాటుకు గేదె మృతిచెందింది. పెంబి మండలం నాగాపూర్, మందపెల్లి గ్రామాల్లో మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్య పు రాశులు తడిసిముద్దాయి. కామారెడ్డి జిల్లాలో 221 కొనుగోలు కేంద్రాల పరిధిలో 66,910 వడ్ల బస్తాలు తడిశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. కోనరావుపేట మండలం మామిడిపల్లిలో సోమినేని శంకరయ్యకు చెందిన కాడెద్దు పిడుగుపాటుకు మృతిచెందింది. ఉమ్మడి వరంగల్ జిల్లా లో పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది.