5 రోజులు ఆలస్యంగా రాక
28 జిల్లాల్లో కురిసిన వానలు
4 రోజుల్లో అంతటా విస్తరణ
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మహబూబ్నగర్ జిల్లాలో ప్రవేశించిన రుతుపవనాలు 48 గంటల్లో మరి కొన్ని ప్రాంతాలకు, మరో రెండు రోజుల్లో చాలా ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా రాష్ట్రంలోకి రుతుపవనాలు జూన్ 8న ప్రవేశించాలి. కానీ, ఆరేబియా మహాసముద్రం, బంగాళాఖాతంలో గాలులు బలహీనంగా ఉండడంతో రుతుపవనాల ఆగమనం ఆలస్యమైంది. నైరుతి రుతుపవనాలు గత ఏడాది కంటే మూడు రోజులు ముందుగా కేరళ తీరాన్ని తాకినా.. రాష్ట్రంలోకి రావడానికి ఐదు రోజులు ఆలస్యమైంది. గత ఏడాది జూన్ 5వ తేదీన నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ ఏడాది ఆలస్యంగా 13న ప్రవేశించాయి. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో రుతుపవనాలు విస్తరించడానికి నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉన్నది. పశ్చిమ దిశ నుంచి కింది స్థాయి గాలులు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఈ నెల 17 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములు గు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.
రాష్ట్రంతో పాటు పలు ప్రాంతాల్లోకి నైరుతి
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంతోపాటు ఆరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్ కొన్ని భాగాలు, కొంకణ్ ప్రాంతం మొత్తం, మధ్య మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు, కర్ణాటకలోని చాలా ప్రాంతాలు, తమిళనాడు, ఉప హిమాలయన్ పశ్చిమ బెంగాల్లోని చాలా ప్రాంతాలు, బీహార్లోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28 జిల్లాల్లో వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారంలో 6.93, కామారెడ్డి జిల్లా మెనూర్లో 6.85, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో 6.63, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 6.50 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఏడు జిల్లాల్లో మాత్రమే 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా మధిరలో అత్యధికంగా 41.5 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా మునగాల, నల్లగొండ జిల్లా దామరచర్లలో 41.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.