హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మత్స్యకార యువతకు ఉపాధి కల్పించేందుకు వెయ్యి సొసైటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. వీటిలో ఇప్పటికే 650 సొసైటీల ఏర్పాటు, సభ్యత్వం పూర్తయిందని తెలిపారు. మిగిలిన వాటిని మూడు నెలల్లోగా ఏర్పాటు చేసి 18 ఏండ్లు నిండిన ప్రతి మత్స్యకారుడికి సభ్యత్వాన్ని ఇవ్వనున్నామని చెప్పారు.
ఎంసీహెచ్ఆర్డీలో శనివారం మత్స్యశాఖపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మె ల్సీ బండ ప్రకాశ్తో కలిసి హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్ల్ల నుంచి సొసైటీల ఏర్పాటు డిమాండ్ ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదని, మత్స్యకారుల సంక్షేమాన్ని గాలికొదిలేశాయని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని యువతకు ఉపాధి కల్పించేందుకు మత్స్యకార సొసైటీల ఏర్పాటుకు ఆదేశించారని చెప్పారు. ఇప్పటికే 650 కొత్త సొసైటీల ద్వారా 13,900 మంది యువతకు సభ్యత్వం ఇచ్చినట్టు తెలిపారు. సొసైటీలకు సులువుగా రుణాలు లభించే అవకాశం ఉంటుందని, ప్రభుత్వం నుంచి అనేక రాయితీలు అందుతాయని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. దేశంలో ఎకడా లేని విధంగా తెలంగాణలో మత్స్యకారులకు లబ్ధి చేకూరుతున్నదని తెలిపా రు.
ఉచితంగా చేప పిల్లల పంపిణీతో వారికి ఆర్థిక భరోసా కలిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందన్నారు. కొత్తగా కేజ్ కల్చర్ పద్ధతి ద్వారా చేపల పెంపకాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు , పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హా, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, విజయ డెయిరీ చైర్మన్ సోమా భరత్కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ముదిరాజ్, యాదవ, కురుమ సంఘం భవనాల నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తిచేయాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ముదిరాజ్ భవన నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ. 5 కోట్లు, ఐదెకరాల స్థలాన్ని కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. నిర్మాణంలో ఉన్న యాదవ, కురుమ సంఘ భవనానికి అదనంగా రూ. 2.61 కోట్లు మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు.