హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణకు నియమించిన పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) గడువు సమీపిస్తున్నది. ఈ కమిషన్ను నియమించి ఇప్పటికే ఐదు నెలలు పూర్తికాగా కమిటీ సభ్యులు ఇంకా ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించడంలోనే మునిగి ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం కమిషన్ గడువు మరో 26 రోజుల్లో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో సమగ్ర నివేదికను సిద్ధం చేసి, ప్రభుత్వానికి సమర్పించడం అనుమానంగానే కనిపిస్తున్నది. రాష్ట్రంలో ఉద్యోగుల వేతన సవరణ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ చైర్మన్గా రెండో పీఆర్సీని నియమించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2న కమిషన్ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఆరు మాసాల్లో నివేదికనివ్వాలని సూచించింది. ఈ కమిటీ గడువు ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది.
కొనసాగుతున్న స్వీకరణ..
పీఆర్సీ కమిటీని నియమించిన వెంటనే అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. దీంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పీఆర్సీ తన పనిని ప్రారంభించింది. ఫిబ్రవరి రెండో తేదీ నుంచి ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించడం ప్రారంభించింది. ఈ గడువు మార్చి నాలుగుతో ముగిసింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలన్నీ తమ ప్రతిపాదనలను కమిటీ ముందుంచాయి. కొన్ని ఉద్యోగ సంఘాల వినతులు మేరకు మరో వారం రోజుల పాటు ప్రతిపాదనల స్వీకరణ గడువును పీఆర్సీ కమిటీ పొడగించింది. ఏదీ ఏమైనా ఏప్రిల్ రెండు లోపు సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడం సాధ్యమయ్యేలా లేదు. మరోవైపు ఈ నెలలోనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మే వరకు ఎన్నికలతోనే గడిచిపోనుంది. అంటే పీఆర్సీ ప్రకటనకు బ్రేకుల మీద బ్రేకులు పడుతున్నాయి. తాజా అంచనాల ప్రకారం పీఆర్సీ కమిటీ గడువును మరికొద్దిరోజుల పాటు పొడగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.