Tragedy | వీణవంక, జూలై 8: కన్న తల్లిని బయటకు గెంటేసిన ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్నగర్లో శనివారం చోటుచేసుకున్నది. రోడ్డునపడ్డ ఆ వృద్ధురాలు న్యాయం కోసం వేడుకుంటున్నది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. హిమ్మత్నగర్కు చెందిన సంగ మధురమ్మ, రాజయ్య దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. భర్త రాజయ్యకు మహారాష్ట్రలో ఉద్యోగం రావడంతో అక్కడే స్థిరపడ్డారు. రాజయ్య ఎనిమిదేండ్ల క్రితం మృతిచెందాడు. ఇద్దరు కొడుకులకు సొంత ఖర్చులతో మహారాష్ట్రలో వ్యాపారాలు పెట్టించి, హిమ్మత్నగర్లో ఉన్న పదెకరాల్లో చెరో ఐదు ఎకరాలు పంచి ఇచ్చింది. మధురమ్మ ప్రస్తుతం హిమ్మత్నగర్లోని ఇంట్లో ఒంటరిగా ఉంటున్నది. కొద్దిరోజులుగా కొడుకులు ఖర్చులకు డబ్బులు పంపకపోవడం, తిండికి కూడా కష్టమవడంతో మధురమ్మ ఇంటింటికీ తిరుగుతూ భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నది. శనివారం ఉదయం మధురమ్మ కొడుకులు ఆమెను బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయారు. దీంతో బతుకు రోడ్డున పడ్డ మధురమ్మ తనకు న్యాయం కావాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నది.