హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ‘రేవంత్రెడ్డి ఎవడు.. మమ్మల్ని హెచ్చరించడానికి, మమ్మల్ని బండకేసి కొట్టే అధికారం ఆయనకు ఎవడిచ్చాడు’ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా శనివారం సీనియర్ నేత వీ హన్మంతరావు విపక్షాల రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను బేగంపేట ఎయిర్పోర్టులో కలిశారు. దీనిపై స్పందించిన రేవంత్రెడ్డి.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా బండకేసి కొడతానంటూ హెచ్చరించారు.
రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై జగ్గారెడ్డి మండిపడ్డారు. ‘వీహెచ్ వయసేంటి..? నీ వయసేంటి..? పెద్దమనిషిని అంత మాటలు అంటావా.? మమ్మల్ని అనడానికి నువ్వు ఎవరు? ‘మేము నీ కూలీలమా..? బంట్రోతులమా..?’ అని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్టు మాటలు అంటే ఇక్కడ ఎవరూ పడటానికి సిద్ధంగా లేరని తేల్చి చెప్పారు. ‘నువ్వు ఒక్కడివే తీస్మార్ఖాన్వా’ అని నిలదీశారు. రేవంత్రెడ్డి వచ్చిన తర్వాత పార్టీకి కొత్తగా వచ్చిన లాభమేమీ లేదని, చెప్పారు.
కాంగ్రెస్ను రేవంత్ ఏమైనా కొనుక్కున్నారా? ఓవరాక్షన్ చేస్తే కుదరని హెచ్చరించారు. రేవంత్రెడ్డి పనికిమాలిన, అవగాహనలేని లీడర్షిప్ చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో ఉంటూ.. పార్టీనే లేకుండా చేయాలని చూస్తున్నావా..? అంటూ రేవంత్రెడ్డి ప్రశ్నించారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై సోనియా, రాహుల్గాంధీకి లేఖ రాయనున్నట్టు తెలిపారు. తక్షణమే ఆయన్ను పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని కోరనున్నట్టు పేర్కొన్నారు.