TPCC | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మూడు తీర్మానాలు తీసుకున్నారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీకి అభినందనలు తెలుపుతూ రేవంత్ రెడ్డి తొలి తీర్మానం తీసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో సమన్వయంతో పనిచేసిన మాణిక్రావు ఠాక్రేను అభినందిస్తూ రెండో తీర్మానం చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియాగాంధీని పోటీ చేయాలని కోరుతూ మూడో తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరుతుందని అన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తమదని పేర్కొన్నారు. టార్గెట్ 17 పెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 12కు తగ్గకుండా లోక్సభ స్థానాలు గెలిపించుకోవాలని అన్నారు. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో సమీక్షిస్తామన్నారు. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇన్ఛార్జిలతో సన్నాహక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 20 తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటానని తెలిపారు.