కోటపల్లి, జనవరి 9: ఓ వ్యక్తి ప్రేమ ఆ కుటుంబం మొత్తాన్ని చిన్నాభిన్నం చేసింది. ఒకరి తర్వాత ఒకరిగా ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్నది. మరొకరిని జైలుకు పంపింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని లింగన్నపేటకు చెందిన రాళ్లబండి సాయికృష్ణ, బొరగళ్ల సౌందర్య ఏడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలతో సంబంధం లేకుండా వేరు కాపురం పెట్టారు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో 3 నెలల క్రితం సాయికృష్ణ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ క్రమంలో కోడలికి అండగా ఉండాల్సిన అత్తింటివారు తన కొడుకు మరణానికి కారణం ఆమె అని కక్ష పెంచుకొన్నారు. ఈ నెల 3న సాయికృష్ణ తండ్రి తిరుపతి.. కోడలు సౌందర్యను దారుణంగా నరికి చంపాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. మనమడు ఆత్మహత్య చేసుకోవడం, కొడుకు హత్య చేసి జైలుకు వెళ్లడంతో కలత చెందిన తిరుపతి తండ్రి రాజబాబు శనివారం గ్రామశివారులోని ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ కారణంగా ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యుఒడికి చేరడం గ్రామంలో విషాదం నింపింది.