హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కరోనా వచ్చి బ్లాక్ బోర్డు చదువును మినీ స్క్రీన్ చదువుగా మార్చేసింది. ఇదే అదనుగా పలు ఎడ్యుటెక్ కంపెనీలు రంగప్రవేశం చేసి ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి. ఒకే టీచర్ ప్రతీసారి స్క్రీన్ మీద కనిపిస్తే పిల్లలకు బోర్ కొడుతుందన్న ఉద్దేశంతో ఈ కంపెనీలు టాపిక్ను బట్టి టీచర్ల ఎంపిక చేస్తున్నాయి. రోజుకో కొత్త టీచర్.. కొత్త విధానంలో బోధించటంతో విద్యార్థులు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. పరీక్షలు నిర్వహించటంతో పాటు క్విజ్, పదకేళి వంటి వాటినీ నిర్వహిస్తుండటంతో పిల్లలు అలసిపోకుండా చురుగ్గా పాఠాలు వింటున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఇలాంటి ఆన్లైన్ క్లాసుల్లో చేర్పిస్తున్నారు. ఆన్లైన్ క్లాసుల కోసం యాప్లో రిజిస్టర్ చేసుకొని, ఫీజు కడితే సరి. క్లాస్ షెడ్యూల్ వచ్చేస్తుంది. సమయానికి క్లాస్ వినటమే తరువాయి. ఆన్లైన్లో గణిత పాఠ్యాంశాలు నేర్పించే క్యూ మ్యాథ్స్ సంస్థ 1-12వ తరగతి వరకు అన్ని బోర్డుల పిల్లలకు ఆన్లైన్లో పాఠాలు చెప్తున్నది. బైజూస్లో యాప్ సైతం ఇదే తరహా ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్నది. టీచర్ల రిక్రూట్మెంట్ కోసం బైజూస్ నోటిఫికేషన్ను జారీచేస్తూ.. ఇంటర్వ్యూ, డెమో, స్క్రీనింగ్ ద్వారా టీచర్లను ఎంపికచేసుకుంటున్నది. అన్అకాడమీ ఆన్లైన్ లెర్నింగ్ వేదిక కూడా డెమో వీడియోల ఆధారంగా టీచర్లను ఎంపికచేస్తున్నది. ఇందులో ఏ తరగతుల వారికైనా పాఠాలు చెప్పవచ్చు. ఎవరైనా బోధించవచ్చు. ఎలాంటి సబ్జెక్టునైనా చెప్పవచ్చు. వేదాంతు వెబ్సైట్, యాప్ కూడా ఇలాంటిదే. ఎల్కేజీ నుంచి 12వ తరగతి వరకు మనకు నచ్చిన సబ్జెక్టును బోధించవచ్చు. పార్ట్టైమ్లో 4 గంటల పాటు, ఫుల్టైమ్లో 6-8 గంటల పాటు బోధించాల్సి ఉంటుంది. అమెరికాలో అత్యధిక విద్యార్థులు వేదాంతు యాప్ను వినియోగిస్తున్నారు. కరోనా వల్ల స్కూళ్లు మూతపడి ఎంతోమంది ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి ఈ యాప్లు ఉపాధినిస్తున్నాయి.
మన పిల్లలకు పక్క రాష్ట్ర టీచర్ల చదువులు
ఒకప్పుడు కేరళ టీచర్లు అంటే గొప్ప పేరు. కేరళ టీచర్లతో బోధన అని మన దగ్గర స్కూళ్లు బోర్డులు కూడా పెట్టుకొన్న రోజులున్నాయి. తల్లిదండ్రులు కూడా పిల్లలను ఆ స్కూళ్లలోనే చేర్పించిన రోజులున్నాయి. ఆ తర్వాత మన టీచర్లు కూడా ఇంగ్లిష్ పరిజ్ఞానం పెంచుకోవటంతో కేరళ టీచర్ల మోజు తగ్గింది. తాజాగా ఆన్లైన్ క్లాసులతో మళ్లీ ఇతర రాష్ట్రాల టీచర్లు చెప్పే పాఠాలు వినే రోజులు వచ్చేశాయి. విద్యార్థులు క్లాస్ వినేందుకు లాగిన్ కాగానే.. హాయ్ చిల్డ్రన్స్. ఐయామ్ సబితాబెనర్జీ. ఐయామ్ ఫ్రం వెస్ట్బెంగాల్. టుడే వీ డిస్కస్ ఎబౌట్ ది లెసన్ అంటూ ఒక రోజు ఒక టీచర్, మరుసటి రోజు ఢిల్లీకి చెందిన రీటా టీచర్, ఆ మరునాడు తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్యం టీచర్ వచ్చి పాఠాలు చెప్పటం విద్యార్థులకు కొత్త అనుభూతి కలిగిస్తున్నది.