Tejaswini Reddy | తుర్కయంజాల్, జూన్ 14: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మణపల్లికి చెందిన కొంతం తేజస్వినిరెడ్డి లండన్లో హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో బ్రహ్మణపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతం శ్రీనివాస్రెడ్డి, రమాదేవి దంపతుల కూతురు తేజస్వినిరెడ్డి (27) ఎంఎస్ చేసేందుకు మూడేండ్ల క్రితం లండన్ వెళ్లింది. అక్కడే స్నేహితులతో కలిసి ఉంటున్నది. ఇటీవలే ఎంఎస్ పూర్తయింది. పెండ్లి సంబంధం కుదరగానే స్వదేశానికి రావాలనుకున్నది. కాగా వీరు ఉంటున్న కాలనీకి చెందిన బ్రెజిల్ యువకుడు డబ్బుల కోసం అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తేజస్వినిరెడ్డి, ఆమె స్నేహితురాలిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తేజస్విని అక్కడికక్కడే మరణించగా ఆమె స్నేహితురాలికి గాయాలయ్యాయి.
ఉన్నత చదువులు పూర్తి చేసుకొని జీవితంలో స్థిరపడుతుందని అనుకున్న సమయంలో ఓ దుండగుడి దాడిలో తేజస్విని మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గత నెలలోనే ఇండియాకు రావాల్సి ఉందని, అప్పుడు వచ్చి ఉంటే ప్రాణాలతోనైనా ఉండేదని తల్లి రమాదేవి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది. తల్లి స్పృహ కోల్పోగా తండ్రి శ్రీనివాస్రెడ్డి బోరున విలపిస్తున్నాడు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి బుధవారం బ్రహ్మణపల్లిలోని తేజస్విని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తేజస్విని మృతదేహాన్ని త్వరగా రప్పించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.