పెద్దపల్లి, మార్చి 17(నమస్తే తెలంగాణ)/ధర్మారం : ప్రజల మాన ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులు పక్కదారి పడుతున్నారు. ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ, చట్టాలను కాలరాస్తున్నారు. నెత్తుటి గాయాలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోలీస్స్టేషన్ మెట్లెక్కినా.. ఫాల్స్ కేసు అంటూ కొట్టిపారేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల కాలంలో.. నాలుగు సార్లు దాడులు జరిగినా పోలీసులు స్పందించడం లేదు. కనీసం రక్షణ కల్పించకపోగా దాడి చేసిన వారి నుంచే ఫిర్యాదులు స్వీకరించి ఉల్టా కేసులు పెట్టి పోలీసులు స్వామి భక్తిని చాటుకుంటున్నారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.. మరోవైపు పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు కూడా ప్రశ్నించే గొంతులపై కుట్రలు చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తూ రౌడీషీట్లను ఓపెన్ చేసేలా పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనమే ధర్మపురి నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి సల్వాజీ మాధవరావు ఉదంతం. కాంగ్రెస్కు చెందిన కొంతమంది మాధవరావుపై హత్యాయత్నం చేశారు. ప్రాణాలతో బతికి బయటపడి నెత్తుటి మరకలతో పోలీసుస్టేషన్ మెట్లెక్కిన మాధవరావుపై అట్రాసిటీ కేసులు పెట్టి, రౌడీ షీట్ ఓపెన్ చేసి జైల్లో పెట్టిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుల్తాన్పూర్ సభలో ప్రస్తావించడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మాధవరావుపై హత్యాయత్నం
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన సల్వాజీ మాధవరావు బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల కార్యకర్త. ప్రస్తుతం ధర్మారం మండలం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని సోషల్మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్తూనే.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోని నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ పోస్టులు పెడుతున్నాడు. మార్చి నెలలో ధర్మారం మండలం ముంజంపల్లి, మారేడుపల్లి, శాలపల్లి, బొమ్మరెడ్డిపల్లిలో ఎండిన వరి పంటలను అక్కడి రైతుల అభిప్రాయాలతో సోషల్మీడియాలో పోస్టు చేశాడు. అంతకు ముందు రైతు బంధు పైసలు రాలేదని పోస్టులు పెట్టాడు. కాళేశ్వరం జలాలు రాకపోవడం వల్లే కరువొచ్చిందని, మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను సాకుగా చూపి సాగుకు నీళ్లివ్వడంలేదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఆ తర్వాత మార్చి 18న సాయంత్రం ధర్మారం మండల కేంద్రంలోని తన ఇంటి నుంచి చౌరస్తాలోని ప్రింటింగ్ ప్రెస్ వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఐదుగురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాధవరావును చుట్టుముట్టారు. మాధవరావు స్కూటీ కీ లాక్కొని ఒక్కసారిగా దాడికి దిగారు. జనం మధ్యనే అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా చితకబాది హత్యాయత్నం చేశారు. తల, మెడ, చేయి, కడుపులో తీవ్రగాయాలు అయ్యాయి. చెవి తెగినంతగా తీవ్రగాయం అయ్యింది. చుట్టూరా జనం ఉన్న ఒక్కరూ ఆపలేదు. కిందపడి నెత్తుటి మడుగులో కొట్టుమిట్టాడుతున్న మాధవరావును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
ఒళ్లంతా రక్తంతో పోలీస్స్టేషన్కు..
దాడి తర్వాత ఒళ్లంతా కారుతున్న రక్తంతో నడుచుకుంటూ ధర్మారం పోలీసుస్టేషన్ మెట్లెక్కాడు మాధవరావు. కాపాడాలని పోలీసులను వేడుకున్నాడు. తనపై యూత్ కాంగ్రెస్ నాయకుడు సోగాల తిరుపతి ఆధర్యంలో ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నం చేశారని ఫిర్యాదు ఇచ్చాడు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. కనీసం రక్షణ కల్పించలేదు. పైగా అది తప్పుడు ఫిర్యాదు అంటూ తిరస్కరించారు.
ఉల్టా మాధవరావే జైలుకు
మాధవరావు ఫిర్యాదును స్వీకరించని పోలీసులు, ఉల్టా మాధవరావుపైనే కేసు నమోదు చేశారు. ఎవరిపైనైతే మాధవరావు ఫిర్యాదు చేశాడో వారి నుంచే ఫిర్యాదును అందుకున్నారు. ఆగమేఘాల మీద మాధవరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 3న పెద్దపల్లి ఏఎస్పీ గజ్జి క్రిష్ణ ఆధ్వర్యంలో సాక్షులను విచారించారు. ఈ నెల 12న మాధవరావును అదుపులోకి తీసుకుని పెద్దపల్లి ఏసీపీ వద్దకు తీసుకెళ్లి కేసు వివరాలన్నీ నమోదు చేసి అదే రోజు రాత్రి 8 గంటలకు నందిమేడారంలోని జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. మాధవరావుకు జడ్జి వెంకట్ సచిన్రెడ్డి ఈ నెల 25 వరకు రిమాండ్కు పంపించారు. ప్రస్తుతం మాధవరావు కరీంనగర్ జైలులో ఉన్నాడు.
స్పెషల్ కమిటీకి డిమాండ్
సల్వాజీ మాధవరావు ఉదంతంపై మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ సభలో ప్రస్తావించారు. డీజీపీకి ఏ మాత్రం గౌరవం ఉన్నా సీనియర్ అధికారితో స్పెషల్ కమిటీ వేసి విచారించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో అత్యుత్సాహంతో దౌర్జన్యానికి పాల్పడిన ఎస్ఐ, ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. మాధవరావు కుటుంబానికి అండగా ఉంటామని చెబుతూనే, తాము న్యాయస్థానం తలుపులు తడుతామని కేసీఆర్ పోలీసులను హెచ్చరించారు.
మాధవరావును మాయం జేయిస్త..
సోషల్ మీడియాలో ఎమ్మెల్యే అడ్లూరి ఆడియో వైరల్‘సల్వాజీ మాధవరావు ఎవడయా లం**డుకు.. వాడు నాపై స్టేట్మెంట్ ఇస్తే ఎవడన్నా కౌంటర్ ఇచ్చిండానయ్యా. నా కొడుకు గురించి మాట్లాడుతాడానయ్యా. లం**కు. వానవ్వని*** . ఒక్క నిమిషాన వాణ్ని మాయం జేయిస్త. కొప్పుల ఈశ్వర్.. వాడు బలరాంరెడ్డి.. మోహన్రెడ్డి.. ఎవడైనా కానీ ధర్మారం మండలంల వాళ్ల సంగతి జూస్త..’ అని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడిన మాటలు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఈ వ్యవహారం మొత్తం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉండి ఉంటుందనే అనుమానానికి బలం చేకూరుస్తున్నది.
మా బిడ్డను చంపేసేలా ఉన్నారు
మా కొడుకుకు ప్రాణ భయం ఉంది. కోడలు తొమ్మిది నెలల గర్భిణి. ఈ సమయంలో కొడుకు మా ఇంట్లో ఉండాలి. ఇంత దౌర్జన్యంగా దాడి చేసి హతమార్చే ప్రయత్నం చేసినా పోలీసులు పట్టించుకోకపోగా, ఉల్టా ఇలా కేసులు పెడితే బతికేది ఎలా..? నిజం మాట్లాడితే చంపే ప్రయత్నం చేస్తున్నరు. మాకు ఒక్కడే కొడుకు. పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారేమో అని భయపడుతున్నం.
– మాధవరావు తల్లి, తండ్రి రాజమణి-మారుతీరావు
కేసీఆర్ బాపూ.. తమ్ముడిని బతికించు
నా తమ్ముడు మాధవరావు. నిజాలను నిర్భయంగా మాట్లాడుతడు. అదే వాడికి శాపమైంది. కేసీఆర్ బాపును, కొప్పుల ఈశ్వర్ను ఎవరు ఏమన్నా వాడు సహించడు. తమ్ముడిని అరెస్టు చేసిన నాటి నుంచి ఇంట్ల అన్నం తింటలేం. నిన్న కేసీఆర్ బాపు సభలో మా తమ్ముడికి జరిగింది చెప్పంగనే ఎంతో ధైర్యం వచ్చింది. కేసీఆర్ బాపూ.. మా తమ్ముడిని బతికించాలె. అక్రమ కేసులను తప్పించాలె. పార్టీ అండగా ఉంటదని బాపు చెప్పిన వెంటనే చానా సంబురపడ్డం. ప్రజలు అన్నీ చూస్తున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలకు ప్రజలు చరమగీతం పాడుతరు. – మాధవరావు అక్క మాధవి