Mid Manair Project | బోయినపల్లి, ఫిబ్రవరి 11: ప్రాజెక్టులో ఇండ్లు మునిగిపోకుండానే, అసలు అక్కడ ఆ నంబర్తో ఇండ్లు లేకుండానే మాధ్యమానేరు ప్రాజెక్టు ముంపు పరిహారం కోసం కొందరు నాయకులు, పలువురు అధికారులు చేసిన భారీ కుంభకోణం ఆలస్యంగా బయటపడింది. అప్పనంగా రూ.3 కోట్లు కాజేసేందుకు భారీ స్కెచ్ వేయడం, చెక్కులు కూడా రెడీకావడం, చివరి నిమిషంలో ఆ గ్రామ నిర్వాసితులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రక్రియ నిలిచిపోయింది.
వివరాలిలా.. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ ఎస్ఆర్ఆర్ జలాశయం నిర్మాణంలో 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అందులో వరదవెల్లి గ్రామం కూడా మునిగిపోయింది. ఆ గ్రామంలో ఇండ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు గత ప్రభుత్వమే పరిహారం చెల్లించింది.
ఆర్అండ్ఆర్ కాలనీలు కూడా నిర్మించి ఇచ్చింది. ఈ క్రమంలో అవినీతి అక్రమాలకు మరిగిన కొందరు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు కలిసి అడ్డదారిలో పరిహారం కొట్టేయాలని ప్లాన్ వేశారు. ఇదే గ్రామంలో ముంపునకు గురై పరిహారం పొందిన తొమ్మిది ఇండ్లకు బై నంబర్లు (ఇంటి నంబర్లు) వేసి రూ.3 కోట్లు కాజేసేందుకు పెద్ద ప్రణాళిక వేశారు. అందరూ కలిసి సంయుక్తంగా తప్పుడు ధ్రువ పత్రాలు, బోగస్ ఇంటి నంబర్లు, తప్పుడు రికార్డులు తయారు చేశారు. దస్ర్తాలు కూడా సిద్ధం చేశారు.
పరిహారం పంపిణీకి అధికారులు చెక్కులు కూడా రాసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో వారు వేములవాడ ఆర్డీవోకు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు గత నెల 25న ఫిర్యాదు చేయడంతో ప్రక్రియ నిలిచిపోయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ బాగోతంపై ఇంటెలిజెన్స్ అధికారులు, ఇతర అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి సమగ్ర నివేదిక కలెక్టర్కు ఇచ్చినట్టు తెలిసింది.
ఇందులో మూడు శాఖల అధికారులు పాత్ర ఉండగా, కేవలం పంచాయతీ రాజ్ శాఖలో రిటైర్డ్ అయిన ఓ ఉన్నతాధికారిపై చర్యలకు సిఫారసు చేసినట్టు సమాచారం. గ్రామస్థుల ఫిర్యాదుతో చెక్కులు నిలిచిపోగా, నియోజకవర్గంలోని ఓ నేత పరిహారం చెక్కులు పంపిణీ చేయాలని అధికారులకు ఫోన్చేసి చెప్పినట్టు తెలిసింది. ఈ విషయమై డీపీవో రవీందర్ను వివరణ కోరగా, వరదవెల్లిలో ముంపునకు గురైన ఇండ్లు, తదితర వివరాలను క్షేత్ర స్థాయిలో రికార్డులను పరీశీలించి కలెక్టర్కు నివేదిక పంపినట్టు తెలిపారు.