హైదరాబాద్ : కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల గ్రామం వద్ద కృష్ణా నదిపై నిర్మించబోయే బ్రిడ్జి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో కొత్త బ్రిడ్జిలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలో 629 వంతెనలను మంజూరు చేశాం. ఇప్పటికే 372 వంతెనలు పూర్తయ్యాయి. 257 వంతెనలు పురోగతిలో ఉన్నాయి. పురోగతిలో ఉన్న వంతెనలు 2022, జూన్ నాటికి పూర్తవుతాయి. వంతెనల కోసం రూ. 3,050 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక కొత్త బ్రిడ్జిలు వచ్చాయి. స్టేట్ రోడ్డు డిపార్ట్మెంట్ తరపున 384 కొత్త బ్రిడ్జిలు, నాబార్డ్ నుంచి 50 కొత్త బ్రిడ్జిలు, ఆర్డీఎప్ నుంచి 43 కొత్త బ్రిడ్జిలు, ఆర్ అండ్ బీ నాన్ ప్లాన్ నుంచి 119 కొత్త బ్రిడ్జిలను మంజూరు చేసుకున్నాం. కొత్త బ్రిడ్జిల కోసం ఈ ఆరు నెలల కాలంలో రూ. 1539 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పలుమార్లు నివేదికను ఇచ్చాం. మన ప్రతిపాదనకు మన్నించి ఈ బ్రిడ్జితో పాటు కల్వకుర్తి నుంచి నాగర్కర్నూల్, కొల్లాపూర్, కృష్ణా నదిపై సోమశిల మీదుగా నంద్యాలకు మొత్తం 170 కి.మీ. పొడవునా జాతీయ రహదారి నంబర్ 167ను నోటిఫై చేశారు. సోమశిల బ్రిడ్జికి రూ. 600 కోట్లు కేటాయించడం జరిగింది. దీనికి సర్వే జరుగుతోంది. ఒక నెలలో సర్వే పూర్తవుతోంది. అనంతరం డీపీఆర్ తయారీ తర్వాత, భూసేకరణ చేపట్టి పనులు ప్రారంభిస్తామన్నారు. మొత్తంగా తొమ్మిది నెలల లోపు సోమశిల బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామన్నారు. కొల్లాపూర్ ప్రజల చిరకాల వాంఛ త్వరలోనే నెరవేరుతుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.