నార్కట్ పల్లి : సమాజంలోని అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి యోధురాలు, మహిళా విద్యాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే. భారతదేశ తొలి ఉపాధ్యాయురాలిగా కీర్తి గడించిన ఆ మాతృమూర్తి జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు.
నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన వేడుకలకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి హాజరై సావిత్రి బాయి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మిన ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే అన్నారు. ఆడపిల్లల చదువుకోసం వారు నిరంతరం కృషి చేశారని ఆ మహనీయురాలి సేవలను స్మరించుకున్నారు. ఆమె చూపిన మార్గంలో నడవడమే ఆమెకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.