హైదరాబాద్ : నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో విద్యుత్ ఖర్చులను తగ్గించాలని, కాలుష్య నివారణకు కృషి చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. ఈ నేపథ్యంలో టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డితో కలిసి ఫుడ్స్ ఫ్యాక్టరీని రాజీవ్ సాగర్ సందర్శించారు.
ఈ సందర్భంగా మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న ప్లాంట్కు అదనంగా మరో సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే విద్యుత్ ఖర్చులు దాదాపు 50 శాతం తగ్గుతాయన్నారు. ఆ డబ్బులను సంస్థ అభివృద్ధి కొరకు వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు. సౌర విద్యుత్ వల్ల మనకు కావాల్సిన విద్యుత్ను మనమే తయారు చేసుకోవడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని కొంత మేర తగ్గించవచ్చని వివరించారు.
ఇందుకోసం టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డితో కలిసి ఫ్యాక్టరీని సందర్శించినట్లు తెలిపారు. సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుంది. టీఎస్ రెడ్కో ఏ విధంగా సాయం చేస్తుందో అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డిని శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ జీఎం విజయలక్ష్మీ, హెచ్ఆర్ మేనేజర్ కృష్ణవేణి, వర్క్స్ మేనేజర్ శ్రీనివాస్ నాయక్, ప్రాసెస్ మేనేజర్ ఏలమంద, పర్చేస్ మేనేజర్ వెంకటయ్య, డిప్యూటీ మేనేజర్లు కోటేశ్వరావు, బాబుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.