వామపక్ష పార్టీల సమావేశం నిర్ణయం
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 25 నుంచి 31 వరకు పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన ఇటీవల నిర్వహించిన తెలంగాణ వామపక్ష పార్టీల సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. ఈ నెల 27న మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన ప్రదర్శన, ధర్నాలు, 30న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, 31న ఇందిరాపారు వద్ద ధర్నా చేపట్టనున్నారు.
సమావేశంలో వామపక్షాల రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, డీజీ నరసింహారావు (సీపీఎం), చాడ వెంకటరెడ్డి, బాలమల్లేశ్ (సీపీఐ), రమ, హన్మేశ్ (సీపీఐఎంఎల్ ప్రజాపంథా), గోవర్ధన్, జేవీ చలపతిరావు (సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ), మురహరి (ఎస్యూసీఐ (సీ), జానకిరాములు (ఆర్ఎస్పీ), సురేందర్రెడ్డి (ఫార్వర్డ్ బ్లాక్), జీ రవి (ఎంసీపీఐ), రాజీవ్ (సీపీఐఎంఎల్ లిబరేషన్) నాయకులు పాల్గొన్నారు.