మహబూబాబాద్ : చదువు వ్యక్తిత్వ, సమాజ వికాసానికి దోహదం చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూరులోని అంబేద్కర్ కాలనీలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చదువు అభివృద్ధికి బాటలు వేస్తుంది. సామాజిక గౌరవాన్ని కల్పిస్తుందన్నారు.
చదువు ఒక్కటే మనిషిని సమున్నతంగా తీర్చిదిద్దుతుంది. అందరూ బాగా చదువుకోవాలని ఆయన సూచించారు. సీఎం కేసీఆర్విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి తెలిపారు. మన ఊరు- మన బడి కింద రూ.7,289 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నామని ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మాధ్యమంలోకి మారుస్తున్నాం. ప్రభుత్వం అనేక ఆశ్రమ పాఠశాలలు పెట్టి విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నాం. విదేశీ విద్య కోసం ప్రత్యేక పథకం పెట్టి పేద విద్యార్థులను ప్రభుత్వం చదవిస్తున్నదని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.