హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు’గా ఉంది కాంగ్రెస్ నాయకుల తీరు. తప్పుడు పనులు చేస్తూ దొరికిపోయేసరికి, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్మీడియా వేదికగా ప్రభుత్వంపై విషప్రచారం చేస్తూ, మహిళలపై నీచమైన పోస్టులు పెడుతూ పోలీసులకు పట్టుబడి గగ్గోలు పెడుతున్నారు. మార్ఫింగ్ ఫొటోలతో ప్రముఖులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నవారు.. ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు దిగడంతో ఇప్పుడు రచ్చకు దిగుతున్నారు. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు నేతృత్వంలోని ‘మైండ్షేర్ యునైటెడ్ ఫౌండేషన్’ సంస్థ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
మంగళవారం సాయం త్రం ఆ కార్యాలయంలో జరిపిన సోదాల్లో ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు బట్టబయలయ్యాయి. తప్పు చేసిన వారిని పట్టుకుంటే.. తమకే ఏదో జరిగిపోయినట్టుగా కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతూ రాజకీయ రాక్షసానందం పొందుతున్న తీరుపై ఇటీవల పలు ఫిర్యాదులు అందాయి. పోలీసులు తీగలాగితే.. ఆ విషపన్నాగం వెనుక ఉన్నది కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు అని తేలింది.
కాంగ్రెస్కు ఎందుకీ ఉలికిపాటు?
ఓ ప్రైవేటు సంస్థలో పోలీసులు తనిఖీ చేస్తే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులెందుకు ఉలిక్కి పడుతున్నారనేది పెద్ద ప్రశ్నగా మారింది. రాజకీయ పార్టీలపై, మహిళల వ్యక్తిగత జీవితాలపై వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారనే కారణంతో సైబర్ క్రైం పోలీసులు తనిఖీ చేసిన ప్రైవేటు సంస్థ ఎలాంటి రాజకీయ పార్టీ పేరుతో నడుస్తున్న విభాగం కాదు. అలాంటప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎందుకింత రచ్చ చేస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓ వైపు అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ను ప్రజలు ఛీకొట్టే పరిస్థితి ఏర్పడటం, మరోవైపు ఇటీవల ప్రకటించిన కమిటీలతో అసమ్మతి తారాస్థాయికి చేరడంతో రాష్ట్ర నాయకత్వంపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులంతా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకు, ఏండ్లుగా పార్టీలో ఉన్నవారికి కమిటీల్లో చోటు దక్కకుండా చేసింది ఆయనేనంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాల నుంచి ప్రజలు దృష్టిని మరల్చేందుకు పక్కదారి రాజకీయానికి తెరలేపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే సునీల్ కనుగోలు అంశంపై కాంగ్రెస్ రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.