హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితా సవరణలో భాగంగా ఇప్పటివరకు కొత్తగా పేరు నమోదు కోసం 1.32 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. ఈ నెల 21 నుంచి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మొదలైందని వివరించారు. ఓటరు జాబితా సవరణపై ఆదివారం అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ జిల్లా నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చిందని ఆయన వెల్లడించారు. ఫారం-7 దరఖాస్తులు 15,044, ఫారం-8 దరఖాస్తులు 42,640 మంది చేశారని వివరించారు. శని, ఆదివారాల్లో ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్కు మంచి స్పందన వచ్చిందని, ఈ రెండు రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 4,522 మంది కొత్తగా పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేశారని వెల్లడించారు. సెప్టెంబర్ 19 వరకు పేర్ల నమోదు, చిరునామా మార్పునకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఫిర్యాదులపై వెంటనే నివేదిక ఇవ్వండి…
కేంద్ర ఎన్నికల సంఘం పంపిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, వాస్తవ నివేదికలు పంపడంలో జాప్యం చేయొద్దని వికాస్రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుకు ప్రతి స్పందనగా తీసుకున్న చర్యలను వివరిస్తూ వివరణాత్మక నివేదికను సీఈవో కోరారు. ఈ సందర్భంగా బహుదూర్పురా, గోషామహల్, నాంపల్లి, శేరలింగంపల్లి నియోజకవర్గాల్లో వచ్చిన ఫిర్యాదులపై సమీక్షించారు. ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.