హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇదేరోజు గత సంవత్సరం కంటే 83వేల మెట్రిక్ టన్నులు అధికంగా ధాన్యం సేకరణ చేశామని వెల్లడించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై మంగళవారం హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని, మాయిశ్చర్ మిషన్లు, ప్యాడిక్లీనర్లు, గన్నీబ్యాగ్లు సరిపడినంత అందుబాటులో ఉన్నాయని వివరించారు. సోమవారం వరకూ 1,32,989 మంది రైతుల నుంచి 8.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని వెల్లడించారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే వానాకాలం ధాన్యం సేకరణ అధికంగా జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోతలకు అనుగుణంగా 4579 కొనుగోలు కేంద్రాలను తెరిచామని, అవసరాల మేరకు మరిన్ని ఏర్పాటు చేసుకోవడానికి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చామన్నారు.
దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే కనీస మద్దతు ధర గ్రేడ్ఏ రూ. 2,060, కామన్ రకానికి రూ. 2,040 లు చెల్లిస్తూ ధాన్యం సేకరిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణి, పౌరసరఫరాల సంస్థ జీఎం రాజారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.