హైదరాబాద్ : కాళేశ్వరం పంప్హౌస్ పనులను వేగవంతం చేయాలని సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్కుమార్ ఆదేశించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్, పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామాల్లో పంప్హౌస్ పనులను స్మితా సబర్వాల్, రజత్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై కలెక్టర్, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ పనులు మందకొడిగా సాగుతున్నాయని, నిర్ధేశించిన సమయంలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలను నివేదిక రూపంలో అందించాలని అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యతలో రాజీపడొద్దని, సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. ప్రతి మూడు నెలలకోసారి పనులను పర్యవేక్షించి, రిపోర్ట్ను అందజేయాలని చెప్పారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్కుమార్ మాట్లాడుతూ పనుల్లో ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులకు అవసరం మేరకు కూలీలు, మిషనరీ, కాంక్రీట్, స్టీల్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. నిర్ధేశించిన సమయంలోగా పనులు పూర్తి చేయాలని, పనులకు సంబంధించి అదనపు నిధుల మంజూరుకి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చొప్పదండి ఎమ్మెల్యేతో కలిసి నారాయణపూర్, చర్లపల్లి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా భూనిర్వాసితులు కోల్పోయిన భూములకు బదులు ఎక్కడైనా భూములను ఇప్పించాలని కోరగా కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ను పరిశీలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, జీ రవి, అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, ఇంజినీర్లు పాల్గొన్నారు.