హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) దేశంలో స్మార్ట్ సిటీల నిర్మాణానికి గొప్ప నమూనాగా మారనున్నది. దాదాపు 66 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ అంతటా ప్రయోగాత్మకంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సాంకేతికతతో కూడిన వందలాది సెన్సర్లను ఏర్పాటు చేశారు. నగర ప్రజలకు సంబంధించిన ఎన్నో అంశాలను ఈ సాంకేతికతతో అధ్యయనం చేస్తున్నారు. దీన్ని దేశంలోనే తొలి ‘స్మార్ట్ లివింగ్ ల్యాబ్’గా గుర్తించారు. నీటి స్వచ్ఛత, లీకేజీ, గాలి నాణ్యత, గాలిలో తేమ, సౌరశక్తి ఉత్పత్తి, వినియోగం, ఆ ప్రాంతంలో రోజువారీ ఉష్ణోగ్రతలు, వర్షం కురిసే సమాచారం, ఆ ప్రాంతంలో రద్దీ ఎలా ఉన్నది? ఎలాంటివారు ఆ ప్రాంతంలో ఉన్నారు? వారు మాస్కులు ధరించారా? లేదా? అనే అంశాలను ఈ స్మార్ట్ ల్యాబ్ నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఆయా వివరాలను డ్యాష్ బోర్డులో చూసేందుకు వీలు కల్పించారు. తెలంగాణ ప్రభుత్వంతోపాటు యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్ (ఈబీటీసీ), ఆమ్స్టర్డామ్ ఇన్నోవేషన్ ఎరీనా (ఏఐఏ), ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ సహకారంతో ఏర్పాటైన స్మార్ట్ లివింగ్ ల్యాబ్ అద్భుత ఫలితాలను ఇస్తున్నది. రెండేండ్ల కిత్రమే ప్రారంభమైన ఈ ల్యాబ్ ఇప్పుడు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నది.
ప్రతి 15 సెకన్లకు గాలి నాణ్యత లెక్కింపు
నగరవాసులు వాయు కాలుష్యం నుంచి బయటపడటంతోపాటు నీటిని, విద్యుత్తును ఆదా చేసుకొనేందుకు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ వినూత్న ఆలోచన చేసింది. ప్రతి 15 సెకన్లకు ఓసారి గాలి నాణ్యతను లెకించి ఆ సమాచారాన్ని సర్వర్కు పంపే ఏర్పాటు చేసింది. వాయు వేగం, దిశ, గాలిలోని తేమ, ఉష్ణోగ్రతను సైతం తెలియజేసే స్మార్ట్ లివింగ్ ల్యాబ్.. గాలి నాణ్యతోపాటు నీటి నిర్వహణ, విద్యుత్తు వినియోగం ఎలా ఉన్నది? వాతావరణ పరిస్థితులు ఎలా మారుతున్నాయనే అంశాలను కూడా పర్యవేక్షిస్తున్నది. ప్రతి 4 గంటలకు ఓసారి నీటిలోని లవణాలు, గాఢతను లెకిస్తున్నది. నీటి వృథాను నివారించేందుకు ఏర్పాటు చేసిన పరికరాలు నిరంతరం పనిచేస్తున్నాయి. వాతావరణ మార్పులు, వర్షపాత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నది. విద్యుత్తు వినియోగాన్ని నిరంతరం లెక్కించడంతోపాటు సౌర విద్యుత్తు వినియోగ సమాచారాన్ని ప్రతి 15 నిమిషాలకు ఓసారి అందజేస్తున్నది.
అన్ని అంశాలను అధ్యయనం చేసేలా..
దేశంలో స్మార్ట్ సిటీలను నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఒక నగరంలోని ప్రతి అంశాన్ని అత్యాధునిక సాంకేతికతతో పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన జీవనశైలిని అలవర్చడమే స్మార్ట్ లివింగ్ ల్యాబ్ లక్ష్యం. దీనిలో భాగంగా గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ అంతటా సెన్సర్లను ఏర్పాటు చేసి ఆ క్యాంపస్ను స్మార్ట్ లివింగ్ ల్యాబ్గా మార్చేశాం. దీని ద్వారా గాలి, నీటి నాణ్యత, విద్యుత్తు వినియోగం లాంటి పలు అంశాలను నిరంతరం పర్యవేక్షించడంతోపాటు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఎంత మంది మాస్కులు ధరించారో కూడా గుర్తించవచ్చు.
– అనూరాధ, లీడ్ ఆరిటెక్ట్, ట్రిపుల్ ఐటీ