హైదరాబాద్ : నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో తొలిసారిగా స్కిన్ సర్జరీ చేయనున్నారు. ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ డాక్టర్ నాగప్రసాద్ పర్యవేక్షణలో ఈ సర్జరీ జరగనుంది. రూ.60 లక్షల వ్యయంతో హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ సహకారంతో ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ఈ స్కిన్ బ్యాంకును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఇవాళ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన మంత్రి హరీశ్రావు స్కిన్ సర్జరీకి సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఇండియాలో ప్రభుత్వ రంగంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్కిన్ సర్జరీలు జరుగుతున్నాయి. ప్లాస్టిక్ సర్జరీ స్కిన్ బ్యాంకు అనేది తెలుగు రాష్ట్రాల్లో ఇది మొట్టమొదటిది.. దేశంలో మూడోది. మొదట ముంబైలో, తర్వాత బెంగళూరులో, ఇప్పుడు హైదరాబాద్లో స్కిన్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చిందన్నారు. చనిపోయిన వారి నుంచి స్కిన్ను తీసుకొని.. దాన్ని 45 రోజుల పాటు ప్రాసెస్ చేసి, ఆ చర్మాన్ని ఉపయోగిస్తారు. ఈ చర్మాన్ని ముఖ్యంగా కాలిన గాయాలతో బాధపడే వారికి ఉపయోగిస్తారు. ఉస్మానియాలో ఇప్పటి వరకు ఇద్దరు స్కిన్ను డొనేట్ చేశారు. ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ డాక్టర్ నాగప్రసాద్.. పర్యవేక్షణలో ఆ స్కిన్తో కాలిన గాయాలతో బాధపడుతున్న వ్యక్తికి సర్జరీ చేయబోతున్నారు అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
అనంతరం డాక్టర్ నాగ ప్రసాద్ మాట్లాడుతూ.. 2021, జూన్ 28న ఉస్మానియా స్కిన్ బ్యాంకును హోంమంత్రి మహముద్ అలీ ప్రారంభించారు. రోటరీ క్లబ్ సౌజన్యంతో హెటిరో గ్రూప్ వారు స్పాన్సర్ చేశారు. భారతదేశంలోనే ప్రభుత్వ సెటప్లో ఇది మూడోది. జీవన్ దాన్ ప్రోగ్రామ్ ద్వారా అపోలో ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్కు గురైన వ్యక్తి నుంచి స్కిన్ తీసుకున్నాం. మరో వ్యక్తి నుంచి కూడా స్కిన్ తీసుకున్నాం. 45 రోజులు ప్రాసెస్ చేశాం. అన్ని టెస్టులు పూర్తి చేసిన తర్వాత ఇవాళ(46వ రోజు) 50 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి స్కిన్ సర్జరీ చేస్తున్నామని డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు.