సునీతా లక్ష్మారెడ్డి వెల్లడి
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ఒంటరి మహిళలకు సహకార సంఘాల అధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించాలని రాష్ట్ర మహిళా కమిషన్ యోచిస్తున్నట్టు చైర్పర్సన్ వీ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. మహిళల రక్షణే మహిళా కమిషన్ ఎజెండా అని, మహిళలకు ఎదురవుతున్న న్యాయపరమైన సమస్యలను పరిషరించడంలో కమిషన్ సభ్యులు ముందుండాలని స్పష్టం చేశారు. బుధవారం ఆమె హైదరాబాద్లోని మహిళా కమిషన్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించి.. కమిషన్లో నమోదైన కేసులపై సమీక్ష నిర్వహించారు.
సరూర్నగర్లో జరిగిన మతోన్మాద హత్యను కమిషన్ తీవ్రంగా పరిగణించిందని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిని నిరోధించేందుకు కఠిన సెక్షన్లను అమలు చేయాలని పోలీసులను కోరారు. ఇటీవల కమిషన్ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ నంబరుకు మహిళల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్తులకు సంబంధించిన వివాదాలు, కోర్టు కేసులు కమిషన్ పరిధిలోకి రావని, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖలను ఆశ్రయించాలని తెలిపారు. సమావేశంలో కమిషన్ సభ్యులు షహీన్ అఫ్రోజ్, కుమ్రా ఈశ్వరీ బాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ పాల్గొన్నారు.