హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జేఎన్టీయూ పరిధిలో అన్ని క్యాంపస్, ఇంజినీరింగ్, ఫార్మసీ, అఫిలియేటెడ్, అటానమస్ కాలేజీల్లో రెగ్యులర్ అకడమిక్ కోర్సులతో పాటు నైపుణ్య కోర్సులను కూడా తప్పనిసరి బోధించాలని వర్సిటీ కీలక నిర్ణయం తీసుకొన్నదని వర్సిటీ వైస్చాన్స్లర్ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. వీసీగా బాధ్యతలు చేపట్టి సోమవారానికి ఏడాది పూర్తి చేసుకొన్న సందర్భంగా సంవత్సర కాలంలో చేపట్టిన సంస్కరణలను ఆయన వివరించారు. నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అనేక నిర్ణయాలు తీసుకొన్నామని వెల్లడించారు. ఇంజినీరింగ్, ఫార్మసీలో కొత్త కరిక్యులానికి కృషి చేశామని అన్నారు. ప్రీ ఆడిట్ విధానం, ఉద్యోగార్థులకు బాలికల హాస్టళ్లలో మినీ లైబ్రరీలు, స్టడీ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సిరిసిల్ల, సుల్తాన్పూర్, వనపర్తిలో యూనివర్సిటీ కాలేజీలను ప్రారంభించామని వివరించారు. గోల్డెన్ జూబ్లీని పురస్కరించుకొని గత అక్టోబర్ 3 నుంచి అనేక కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. మెగా జాబ్మేళాలు, వీసీల సదస్సులు, ఫ్రెంచ్ కల్చరల్ నైట్ ఏర్పాటు చేశామని తెలిపారు. పైథాన్ ప్రోగ్రాం, రిసెర్చ్, క్రియేటింగ్ రిసెర్చ్ సదుపాయాలు, బీటెక్ స్థాయిలో మైనర్, మేజర్ డిగ్రీ విధానం, బ్లెండెడ్ మోడ్ విధానం, కోర్స్ ఎగ్జిట్ పాలసీ, డ్యుయల్ డిగ్రీ ఆప్షన్, కంటిన్యూయస్ అసెస్మెంట్, క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ వంటి సంస్కరణలు తీసుకొచ్చామని పేర్కొన్నారు.