నమస్తే తెలంగాణ నెట్వర్క్: సికింద్రాబాద్ స్వప్నలోక్ అగ్నిప్రమాదం ఆరుగురు యువతీయువకుల జీవితాలను చిదిమేసింది. గురువారం సాయంత్రం సికింద్రాబాద్ స్వప్నలోక్లో చెలరేగిన మంటల్లో 15మంది పై అంతస్థుల్లోనే ఉండిపోయారు. ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద వారిని బయటికి తీసుకువచ్చినా బాత్రూంలో దాక్కున్న ప్రమీల, శివ, వెన్నెల, త్రివేణి, శ్రావణి, ప్రశాంత్ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వీరిని గాంధీ దవాఖానకు తరలించినా, పరిస్థితి చేయిదాటిపోయింది. వెన్నెలది వరంగల్ జిల్లా నర్సంపేట్ మండలం మర్పల్లి. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నెకు చెందిన ప్రశాంత్ది వ్యవసాయ కుటుంబమే.
త్రివేణి తల్లిదండ్రులు కూలీపనులు చేసుకొనేవారే. ఈమెది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుద్దపల్లి. శ్రావణి తల్లిదండ్రులు హోటల్లో పనిచేస్తారు. వీరిది వరంగల్ జిల్లా ఖానాపురం. ఇదే మండలం చంద్రయ్యపల్లికి చెందిన శివ బీటెక్ చదివాడు. ఉగాదికి ఇంటికి వస్తానని కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ప్రమీల తల్లిదండ్రులు కూడా వ్యవసాయ కూలీలే. మహబూబాద్ జిల్లా సురేశ్నగర్లో నివాసం. ఓ కమీషన్ ఆధారిత మల్టీ లెవల్ కంపెనీలో పనిచేసేందుకు వీరంతా ఒక్కొక్కరు రూ.3 లక్షల చొప్పున చెల్లించినట్టు తెలిసింది. రోజూవారీ టార్గెట్లు పూర్తి చేసేందుకు వారంతా బిజీగా ఉన్నారు.
ఆ సమయంలోనే అగ్ని ప్రమాదం జరిగింది. ఈ కంపెనీలో చేరకపోయుంటే తమ బిడ్డలు మృతిచెందేవారు కాదని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై మహంకాళి పోలీసులు కేసు నమోదు చేశారు. స్వప్నలోక్ సూర్యకిరణ్ ఎస్టాబ్లిష్మెంట్ అసోసియేషన్, కేడియా ఇన్ఫోటెక్ లిమిటెడ్, వికాస్ పేపర్ ప్లెక్సో ప్యాకేజింగ్ లిమిటెడ్, క్యూనెట్ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్పై కేసులు నమోదు చేశారు. జేఎన్టీయూ బృందం పర్యవేక్షించి నివేదిక ఇచ్చే వరకు భవనాన్ని మూసివేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. కాగా, స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఫైర్ ఫైటర్ యంత్రాలు పనిచేయలేదని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఐదో అంతస్థులోని కారిడార్లలో కార్డ్బోర్డు బాక్స్లు, చెత్త చెదారంతో నింపేశారని, దీంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయని వెల్లడించారు.