హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టుకు ఆరుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సోమవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకొన్నది. హైకోర్టులో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్న ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేశ్ భీమపాక, పుల్ల కార్తీక్, కాజా శరత్, జగ్గన్నగారి శ్రీనివాస్ రావు, నామవరపు రాజేశ్వర్రావు పేర్లను గతంలోనే హైకోర్టు కొలీజియం సుప్రీం కోర్టుకు సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు కూడా తాజాగా సమ్మతి చెప్పింది. వీరి పేర్లను కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి నివేదిస్తుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం కేంద్ర న్యాయ శాఖ గెజిట్ ప్రచురించాక కొత్త వారితో న్యాయమూర్తులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు. ప్రస్తుతం హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి 27 మంది జడ్జిలు విధులు నిర్వహిస్తున్నారు. కొత్తవారి ఆమోదానంతరం ఆ సంఖ్య 33కు పెరుగుతుంది. మరో 9 పోస్టులు ఖాళీగా ఉంటాయి.
సీజేఐ ఎన్వీ రమణ కృషి
తెలంగాణ హైకోర్టు 2019 జనవరి 1వ తేదీన ఏర్పాటైనప్పుడు న్యాయమూర్తుల సంఖ్య 24. ప్రస్తుతం హైకోర్టులో మొత్తం జడ్జిల పోస్టుల సంఖ్య 42కు చేరింది. ఇంతటి భారీ స్థాయిలో న్యాయమూర్తుల నియామకం జరిగేలా చేయటంలో తెలుగు బిడ్డ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక పాత్ర పోషించారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక హైకోర్టులో జడ్జిల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకొన్న ఆయన.. ఇప్పటి వరకు 17 మంది న్యాయమూర్తుల నియామకాలు చేశారు. తాజాగా సిఫార్సు చేసిన ఆరుగురిని కలిపితే 23 మందిని నియమించినట్టు అవుతుంది. కాగా, ఏపీ నుంచి ఒకరు తెలంగాణకు బదిలీ అయ్యారు. జడ్జిల నియామకంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు సీజేఐ పెద్ద పీట వేశారు. అచ్చమైన తెలంగాణ న్యాయవాదులనే జడ్జిలుగా నియమిస్తామని గతంలో చెప్పినట్టుగా తాజాగా ఆచరణలో చూపించారు. తెలంగాణ విషయంలో సీజేఐ ఎన్వీ రమణ ప్రత్యేక శ్రద్ధ చూపటంపై న్యాయవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
గడపగడపకూ న్యాయం
రాష్ట్రంలో మొన్నటిదాకా 10 జిల్లా కోర్టులే ఉండేవి. సీఎం కేసీఆరే స్వయంగా అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మను కలిసి చేసిన వినతితో కోర్టుల సంఖ్య 32కు పెరిగింది. ఇటీవల హైకోర్టులో జరిగిన వేడుకలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగిస్తూ, సీఎం కేసీఆర్ న్యాయ వ్యవస్థకు అందిస్తున్న కృషిని కొనియాడారు. గడపగడపకూ న్యాయం చేరేలా దేశంలో ఎప్పుడూ జరగని విధంగా కొత్త రెవెన్యూ జిల్లా కోర్టుల ఏర్పాటుకావటం పట్ల తెలుగువాడిగా గర్విస్తున్నానని చెప్పారు. అనూహ్య స్థాయిలో న్యాయ సంసరణలకు తెలంగాణ శ్రీకారం చుట్టిందని కీర్తించారు. కాగా, హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీజేఐ ప్రతిపాదించగానే సీఎం కేసీఆర్ కార్యరూపంలోకి తెచ్చిన విషయం తెలిసిందే.
ఏనుగుల వెంకట వేణుగోపాల్
కరీంనగర్లోని మంకమ్మతోటలో 1967 ఆగస్టు 16న జన్మించారు. తండ్రి ఈవీ రా జేశ్వర్రావు చేనేత, వస్త్ర పరిశ్రమ డిప్యూటీ డైరెక్టర్గా చే శారు. వేణుగోపాల్ 1992 లో లా చదివి అదే ఏడాది హైకోర్టులో ఎన్రోల్ అయ్యారు. కరీంనగర్లో లా ప్రాక్టీస్ ప్రారంభించారు. సుప్రీంకోర్టులో ప్రముఖ లాయర్ రాంజఠ్మలానీ వద్ద జూనియర్గా చేశారు. హైకోర్టులో రైల్వే స్టాండింగ్ కౌన్సెల్గా పనిచేశారు. 2021లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు.
నగేశ్ భీమపాక
భద్రాచలంలో 1969 మార్చి 8న జన్మించారు. తం డ్రి భూపతిరావు స్వాతం త్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే. నగేశ్ 1993లో న్యాయవాదిగా ఎన్రోల్ అ య్యారు. సివిల్, క్రిమినల్, కార్మిక, రెవెన్యూ, ము న్సిపల్ చట్టాల కేసులనే కాకుండా రాజ్యాంగపరమైన కేసుల్లో వాదించిన అనుభవం ఉన్నది. ప్రభు త్వ సహాయ న్యాయవాది, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సెల్గా, పరిశ్రమల శాఖ ప్రభుత్వ న్యాయవాదిగా చేశారు. ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వ న్యాయవాదిగా చేస్తున్నారు.
పుల్ల కార్తీక్
జగిత్యాలలో 1967 జూ న్ 4న జన్మించారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ, పీజీ, ఓయూ కాలేజీలో లా, ఎల్ఎల్ఎం చదివాక 1996 మార్చి 27న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2015లో ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ ప్రభుత్వ న్యా యవాదిగా నియమితులయ్యారు. 2017 నుంచి ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.
కాజా శరత్
భద్రాచలంలో 1971 జనవరి 29న జన్మించారు. ఆంధ్రా వర్సిటీ నుంచి లా, ఓయూ నుంచి ఎంఏ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1997 డిసెంబర్ 31న లాయర్గా ఎన్రోల్ అయ్యారు. కొత్తగూడెం, భద్రాచలం కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 2002 నుంచి హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. అన్ని రకాల కేసులలో వాదించిన అనుభవం ఉన్నది.
జగ్గన్నగారి శ్రీనివాస్ రావు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో 1969 ఆగస్టు 31న జన్మించారు. ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ చదివారు. 1999 ఏప్రిల్ 29న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రముఖ న్యాయవాది జీ కృష్ణమూర్తి వద్ద జూనియర్గా పనిచేశారు. హైకోర్టులో 2006 నుంచి ప్రాక్టీస్ ప్రారంభించారు. అన్ని స్థాయి కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 2015 నుంచి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ స్టాండింగ్ కౌన్సెల్గా పని చేస్తున్నారు.
నామవరపు రాజేశ్వర్రావు
మహబూబాబాద్ జిల్లా సుదాన్పల్లిలో 1969 జూన్ 30న జన్మించారు. హైదరాబాద్లో లా పూర్తి చేశారు. 2001 నుంచి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2015 నుంచి 2019 వర కు కేంద్ర ప్రభుత్వ స్టాండిం గ్ కౌన్సెల్గా చేశారు. 2019 నుంచి హైకోర్టులో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్నారు.