హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో ఆరు కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. బుధవారం కూడా ఆరు కేసులు నమోదైన విషయం తెలిసిందే. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 925 కరోనా టెస్టులు నిర్వహించగా.. హైదరాబాద్లో నాలుగు, మెదక్, సంగారెడ్డిలో ఒక్కొక్కటి నమోదయ్యా యి. ఒకరు కోలుకొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా ఇండ్లల్లోనే ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
వరంగల్ ఎంజీఎం దవాఖానలో కరోనా కేసు నమోదైనట్టు పుకారు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. భూపాలపల్లి జిల్లాకు చెందిన వృద్ధురాలు కరోనా లక్షణాలతో ఎంజీఎం కొవిడ్ వార్డులో చేరిందని వాట్సాప్లో తప్పుడు కథనం చక్కర్లు కొట్టింది. అయితే అధికారులు ఈ విషయాన్ని ఖండించారు. ఇప్పటివరకు కరోనా జేఎన్-1 లక్షణాలు ఉన్న రోగులు రాలేదని స్పష్టం చేశారు. అనుమానితురాలిగా గుర్తించిన మహిళకు ప్రత్యేక వార్డులో వైద్య చికిత్స అందిస్తున్నామని, శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆరుగురి నుంచి నమూనాలు సేకరించి కాకతీయ వైద్య కళాశాలలోని వైరాలజీ ల్యాబ్కు పంపించామని, రిపోర్టు ఆధారంగా చికిత్స చేస్తామని తెలిపారు.